బయ్యారం, జూలై 13 : వానకాలం వచ్చిందంటే చాలు.. చిన్నాపెద్దా తేడా లేకుండా నీటి పరవళ్ల వద్దకు వెళ్లి ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. సందర్శన ప్రాంతాల్లో కొందరు అత్యుత్సాహంతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. జలపాతాలు, చెరువులు, వాగులు, కాలువల్లో ఇష్టారీతిన ప్రవర్తిస్తూ.. సాహస కృతాల్లా సెల్ఫీలు దిగుతూ ఒక్కోసారి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. వానకాలంలో జల వనరులన్నీ పరవళ్లు తొక్కుతుండగా వాటి వద్దకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మానుకోట జిల్లాలోని బయ్యారం, గంగారం, గూడూరు ప్రాంతాల్లో సందర్శనీయ ప్రాంతాలున్నాయి. బయ్యారంలో పెద్దచెరువు, తులారాం ప్రాజెక్టు, బయ్యారం పెద్ద గుట్టపై రెండు పాండవుల జలపాతాలు, చింతోనిగుంపు సమీపంలో ని అడవిలో జలపాతం ఉన్నాయి. గంగారం, బయ్యారం మండలాల సరిహద్దు మిర్యాల పెంట అటవీ ప్రాంతంలోని పాండవుల గుట్టల్లో ఏడు బావుల జలపాతానికి రాష్ట్ర గుర్తిం పు ఉంది. గూడూరు మండలం కొమ్ములవంచ అటవీ ప్రాంతంలో భీమునిపాదం జలపాతం ఉన్నది. ఇవేగాక ము లుగు జిల్లాలో బొగతతో పాటు పెద్ద సంఖ్యలో జలపాతాలు ఉన్నాయి. లక్నవరం, పాకాల సరస్సులున్నాయి. అంతేకాక ఇప్పుడు ఊరూరా చెరువులు సైతం నిండుకుండలను తలపిస్తూ తాజా వానలకు మత్తళ్లు దుంకుతున్నాయి.
ఈ సమయంలో వాటి వద్దకు వెళ్లి ఆహ్లాదంగా గడపాలనుకునేవారు జాగ్రత్తగా ఉంటే మంచిది. నీటి ప్రవాహం వద్దకు, లోతైన, ఎత్తయిన ప్రాంతాలు, కొనలకు వెళ్లి సెల్ఫీలు దిగడం, మద్యం తాగి కొండలు, గుట్టలు ఎక్కేందుకు ప్రయత్నించడం ఎంతమాత్రం మంచిది కాదు. గతంలో బయ్యారం పెద్దచెరువులో సెల్ఫీలు దిగుతూ పడి మహబూబాబాద్కు చెందిన జైరాజ్, ప్రేమ్కుమార్, వరంగల్కు చెందిన రాజేశ్వరావు చనిపోయారు. ఇలా ఎందరో యువకులు జలాశయాల్లో పడి చనిపోయిన ఘటనలు ఉన్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా.. పర్యాటకులు వాటిని అతిక్రమించి ముందుకు పోతున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదాల బారిన పడుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
జలపాతాలు, ఇతర నీటి వనరుల వద్దకు వెళ్లిన సందర్భంలో సందర్శకులు అప్రమత్తంగా ఉండాలి. సెల్ఫీ కోసం నీటి ప్రవాహాల వద్దకు వెళ్లకూడదు. ప్రమాదకరంగా ఉన్న గుట్టలు, కొండలు ఎక్కేందుకు ప్రయత్నించొద్దు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన చోట నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఒంటరిగా పర్యాటక ప్రదేశాలకు పంపవద్దు.