వరంగల్, సెప్టెంబర్ 27: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో పట్టణప్రగతి నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ఆమె పట్టణప్రగతి పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రట్టణప్రగతి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మేయర్ అధికారులకు సూచించారు. వరంగల్ మహానగరంలో రూ. 179.34 కోట్లతో 409 అభివృద్ధి పనులు మంజూరు చేశామన్నారు. ఇందులో 106.44 కోట్లకు సంబంధించిన 259 పనులు మాత్రమే పూర్తి కావడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
పురోగతిలో ఉన్న 31 అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మిగిలిన 119 పనులు వెంటనే ప్రారంభించాలని ఆమె అధికారులను ఆదేశించారు. మొదలు పెట్టని పనుల్లో సమీకృత మార్కెట్లు, డంపింగ్యార్డులు, స్ట్రామ్ వాటర్ డ్రైన్, పార్కులు, స్వచ్ఛ ఆటోల కొనుగోళ్లు ఉన్నాయన్నారు. ప్రతి డివిజన్లో ఫాగింగ్ జరిగేలా ప్రణాళికలు చేయాలని మేయర్ అన్నారు. వీధి దీపాలు సక్రమంగా వెలిగేలా అన్నింటికీ వారం రోజుల్లో టైమర్లు బిగించాలన్నారు. బల్దియా భూముల రక్షణకు ప్రహరీలు నిర్మించాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ నాగేశ్వర్, సిటీ ప్లానర్ వెంకన్న, సీహెచ్వో సునీత, చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు జోనా, రవీందర్యాదవ్, ఈఈలు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్రావు, రాజయ్య, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య ఆదేశాలు జారీ చేశారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో 18004251980, 9701999645, 7997100300 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.