జిల్లాలో ఈ ఏడాది వానకాలం ధాన్యం కొనుగోళ్లకు పౌర సరఫరాల సంస్థ పక్కా ప్రణాళిక రూపొందించింది. జిల్లాలోని 13 మండలాల్లో రైతులు 1,18,272 ఎకరాల్లో వరి సాగుచేసినట్లు వ్యవసాయ శాఖ లెక్క తేల్చగా, 2,58,350 టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇందులో రైతుల నుంచి నేరుగా 2.20 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేసిన సివిల్ సప్లయ్ యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ బీ గోపికి నివేదిక అందజేసింది. కొనుగోళ్ల కోసం 174 కేంద్రాలు ఏర్పాటుచేయాలని ప్రతిపాదనలుండగా, ఈసారి సాగు విస్తీర్ణం తొమ్మిది వేల ఎకరాలు పెరుగడంతో అవసరమైతే మరిన్ని పెంచాలని కలెక్టర్ సూచించారు.
వరంగల్, సెప్టెంబర్ 22(నమస్తేతెలంగాణ) : జిల్లాలో వానకాలం వరిసాగు విస్తీర్ణం గత సంవత్సరం కంటే సుమారు 9వేల ఎకరాలు పెరిగింది. అత్యధికంగా రాయపర్తి మండలంలో రైతులు 21,852 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. 17,225 ఎకరాల సాగుతో ఖానాపురం మండలం రెండో స్థానంలో, 15,709 ఎకరాల సాగుతో పర్వతగిరి మండలం మూడో స్థానంలో ఉండగా, ఖిలా వరంగల్ మండలంలో 2,135 ఎకరాల్లో, అతి తక్కువగా వరంగల్ మండలంలో 445 ఎకరాల్లో వరి సాగు చేశారు. గత సంవత్సరం వానకాలంలో 1,09,485 ఎకరాల్లో పంట సాగు చేయగా, ధాన్యం దిగుబడి 2,04,042 టన్నులు వచ్చింది. ఈ ఏడాది 1,18,272 ఎకరాల్లో వరి సాగవ్వగా 2,58,350 టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. కాగా, 20 వేల టన్నులు స్థానిక అవసరాలకు పోతే మరో 5 వేల టన్నులు సీడ్ కోసం వినియోగించే అవకాశం ఉంది. మిగతా 2,33,350 టన్నుల ధాన్యం మార్కెట్కు రావొచ్చు. రైస్ మిల్లర్లు దాదాపు 13,350 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇంకో 2.20 లక్షల టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరతో రైతుల నుంచి ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ రెండో వారం నుంచి ధాన్యం మార్కెట్కు రానుంది. కాగా, ధాన్యం కొనుగోలు ఫిబ్రవరి వరకు కొనసాగనుంది.
2.20 లక్షల టన్నుల కొనుగోలుకు..
ధాన్యం కొనేందుకు జిల్లాలో 174 కేంద్రాల ఏర్పాటుకు పౌరసరఫరాల సంస్థ అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. ఐకేపీకి 45, పీఏసీఎస్లకు 109, వ్యవసాయ మార్కెట్(ఏఎంసీ)లకు 4, జీసీసీకి 1, ఎఫ్పీవోలకు 15 కేంద్రాలను కేటాయించేందుకు ప్రతిపాదించారు. 2.20 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు గన్నీ సంచులు ఎన్ని అవసరం, ప్రస్తుతం అందుబాటులో ఎన్ని ఉన్నాయి, ఇంకా సమకూర్చుకోవాల్సినవి ఎన్ని అనేది ప్రణాళికలో పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులపైనా దృష్టి సారించారు. టార్పాలిన్లు 2,400, ప్యాడీ క్లీనర్లు 120, తేమకొలిచే యంత్రాలు 120, వెయింగ్ మిషన్లు 240 అవసరమని తెలిపారు. టార్పాలిన్లు అవసరానికి మించి 2,909 అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్యాడీ క్లీనర్లు 66, తేమకొలిచే యంత్రాలు 107, వెయింగ్ మిషన్లు 261 ఉన్నాయని తెలిపారు. అక్టోబర్లో మొదట వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, సంగెం మండలాల్లో వరి కోతలు ప్రారంభం కానున్నందున ధాన్యం కొనుగోలుపై కొద్దిరోజుల క్రితం అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు.
ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష..
వానకాలం ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టర్ గోపి బుధవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ భాస్కర్, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి లక్ష్మీభవాని, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఉషాదయాళ్, డీఆర్డీవో సంపత్రా వు, డీసీవో సంజీవరెడ్డి సమావేశానికి హాజరయ్యారు. వరి సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడుల అంచనా, రైతు ల నుంచి నేరుగా ప్రభుత్వం కొనాల్సిన ధాన్యం అంచనాలు, కొనుగోలు కేంద్రాల ప్రతిపాదనలు, అవసరమైన మౌలిక వసతులను కలెక్టర్ గోపికి వివరించారు. ఇప్పటికే చేపట్టిన ముందస్తు ఏర్పాట్లను తెలిపారు. కాగా, అవసరమైన చోట కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలని కలెక్టర్ సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా తీసుకోవాలని ఆదేశించారు.