రంగారెడ్డి, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ) : చేవెళ్ల లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. చివరిరోజు గురువారం నామినేషన్ల జాతర సాగింది. ఈ ఒక్క రోజే 30 మంది అభ్యర్థులు 32 నామినేషన్లను దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంకకు నామినేషన్లను సమర్పించారు. మంచి ముహూ ర్తం చూసుకుని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్రెడ్డిలు ఇదివరకే నామినేషన్లు వేసినప్పటికీ వారి తరఫున పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు గురువారం మరో సెట్ నామినేషన్లు వేశారు. స్వతంత్ర అభ్యర్థులతోపాటు ఇతర పార్టీల నుంచి సైతం అధిక సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి మొత్తం 64 మంది అభ్యర్థులు 88 నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన ఉండగా.. 29వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉన్నది.
ఇక హోరెత్తనున్న ప్రచారం..
లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెట్టనున్నాయి. బీఆర్ఎస్ పార్టీ పక్కా వ్యూహంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్తోపాటు మాజీ మంత్రి సబితారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు తమదైన వ్యూహాలతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఇప్పటికే చేవెళ్ల ఎంపీ ఎన్నికలకు సంబంధించి ఒక విడుత సమీక్షలు, సమన్వయ సమావేశాలు పూర్తయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేవెళ్ల నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మరోపక్క బస్సు యాత్ర కొనసాగుతున్నది. కేటీఆర్, హరీశ్రావు వంటి నేతలు పలు దఫాలుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు బీజేపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారాన్ని మరింతగా హోరెత్తించనున్నాయి.