హైదరాబాద్, ఏప్రిల్25 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయవిచారణ గురువారం ప్రారంభమైంది. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటన ప్రారంభించనున్నట్టు చెప్పారు. ప్రాజెక్టులోని నిర్మాణ లోపాలు తదితర అంశాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కలకత్తాకు చెందిన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. విచారణ కోసం బీఆర్కే భవన్లో ఇప్పటికే ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కమిషన్కు సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా నేతృత్వంలో నోడల్ అధికారుల బృందాన్ని నియమించింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. విచారణకు అంగీకరించిన కమిషన్కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జస్టిస్ ఘోష్తో సమావేశమై కాళేశ్వరం అంశాలను వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. జస్టిస్ ఘోష్కు ఏపీ సీజేగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, లోక్పాల్గా అపార అనుభవం ఉన్నదని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా నివేదికనివ్వాలని కమిషన్కు కోరినట్టు చెప్పారు. కమిషన్ అడిగిన వివరాలను అందిస్తామని తెలిపారు. విచారణకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మేడిగడ్డ ఆనకట్టపై ఎన్డీఎస్ఏ కమిటీ నివేదిక ప్రకారం మరమ్మతులు,అంశాలపై చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉత్తమ్ వివరించారు.
జస్టిస్ ఘోష్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై రెండు మూడు రోజుల్లో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పారు. తాను స్వతహాగా ఇంజినీర్ను కాదని తెలిపారు. విచారణలో నిపుణుల అభిప్రాయాలను, ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ రిపోర్టులను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్ర ఇంజినీర్లతో, ఎన్డీఎస్ఏ అథారిటీతో సమావేశం అవుతామని చెప్పారు. బరాజ్లతో సంబంధం ఉన్న అందరినీ కలుస్తామని, కావాల్సిన సహాయక సహకారాలను తీసుకుంటామని వెల్లడించారు. నిర్మాణ సంస్థలతోపాటు అవసరమైతే రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తామని తెలిపారు. అవసరమైతే మాజీ సీఎం కేసీఆర్ను పిలిచి వివరాలు సేకరిస్తామని తెలిపారు. లీగల్ అంశాల ఆధారంగానే విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్టు నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. ఇందుకోసం బీఆర్కే భవన్ 8వ అంతస్థులో ప్రత్యేక బ్యాక్సులను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. ఫిర్యాదు చేయాలనుకునేవారు ఫిర్యాదు/వినతిపత్రాలను ఆధారాలతోసహా నోటరీ ద్వారా ప్రమాణపూర్వక అఫిడవిట్ రూపంలో సీల్డ్ కవర్లో ఉంచి పెట్టెల్లో వేయాలని కోరారు. పోస్ట్ ద్వారా అయినా పంపవచ్చని చెప్పారు. మే 31 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పారు. నోటరీ అఫిడవిట్ లేని, సాక్ష్యాధారాలు లేని పత్రాలను తిరస్కరిస్తామని స్పష్టంచేశారు.