వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 22: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకనుణంగా వైద్యులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ గోపి సూచించారు. బుధవారం ఎంజీఎం దవాఖానను సందర్శించి విభాగాల వారీగా పరిశీలించారు. కొవిడ్ వార్డు పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం వర్క్షెడ్ పక్కన ఉన్న బావి, నర్సింగ్ హాస్టల్ను పరిశీలించి ఖాళీ స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఓపీ విభాగంలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్య సేవలు పొందిన చిల్పూరు మండలం రాజవరం గ్రామానికి చెందిన భూక్యా వెంకన్న, ఆత్మకూరుకు చెందిన రమాదేవితో మాట్లాడారు. ఎన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు? వైద్యుల సేవలు ఎలా ఉన్నాయి.. అని అడిగారు. మెడికల్ ఓపీ విభాగంలో సిబ్బంది నమోదు చేస్తున్న రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం సూపరింటెండెంట్ చాంబర్లో వివిధ విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. అవసరమైన విభాగాలను విస్తరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, వరంగల్ కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్దాస్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్రెడ్డి, వరంగల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ, ఎంజీఎం ఆర్ఎంవో డాక్టర్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సీకేఎం దవాఖానలో..
వరంగల్ సీకేఎం దవాఖానను సందర్శించిన కలెక్టర్.. మొదట ప్రభుత్వం మంజూరు చేసిన ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ను పరిశీలించారు. పనులు పూర్తి చేసి త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న బాలింతలు, రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. వీలైనంత త్వరగా బ్లడ్ స్టోరేజ్ యూనిట్ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలన్నారు. వైద్యసేవలను మెరుగుపర్చేందుకు మౌలిక వసతులపై పూర్తి నివేదిక అందించాలని సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మలాదేవిని ఆదేశించారు. కార్యక్రమంలో సీకేఎం వైద్యశాల ఆర్ఎంవో డాక్టర్ శ్యాంకుమార్, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ పాల్గొన్నారు.
ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
ఖిలావరంగల్: జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ బీ గోపి సూచించారు. కలెక్టరేట్లో ఆయన అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 4957 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 671 నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు. వివిధ దశల్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పాలకుర్తి డివిజన్ ఇరిగేషన్ ఈఈ రమేశ్బాబు, పీఆర్ ఈఈ శంకరయ్య, ఇరిగేషన్ డీఈఈ కిరణ్కుమార్ పాల్గొన్నారు.