బాధితులు భయం వీడి ధైర్యంగా ఉండాలి
పాజిటివ్ వచ్చిన వారికి చేతనైన సాయం చేయాలి
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
లింగాలఘనపురం, మే 25: ఖర్చుకు వెరవకుండా, లాక్డౌన్ నష్టాన్ని భరిస్తూ… కరోనా కట్టడికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన కరోనా బాధితులను మంగళవారం ఆయన పరామర్శించారు. మండలకేంద్రంలోని ఐసొలేషన్ కేంద్రంలో బాధితులకు భోజన ప్యాకెట్లు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు చేస్తూ పాజిటివ్ వచ్చిన వారికి ఉచితంగా మందుల కిట్స్ అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణకు టీకాలు వేయిస్తున్నామన్నారు. మొదటి విడుతలో టీకాలు వేసుకున్న వారికి రెండో డోస్ వేస్తున్నట్లు వివరించారు. కరోనా బారిన పడిన వారికి నివాసయోగ్యం లేకుంటే ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాల్లో ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
బాధితులకు ప్రభుత్వ అండదండలు
ఇన్నివిధాలా తెలంగాణ ప్రభుత్వం కరోనా బాధితులకు అండదండలు అందిస్తున్నదని, భయం వీడి ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే రాజయ్య సూచించారు. పాజిటివ్ వచ్చిన వారిని చులకనగా చూడకుండా, వారికి చేతనైన సాయం అందించి భరోసా కల్పించాలని కోరారు. కరోనా బాధితుల్లో ధైర్యం నింపేందుకే గ్రామాల్లో పర్యటిస్తూ వారిని పరామర్శిస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఎంపీపీ చిట్ల జయశ్రీ-ఉపేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సురేందర్, డాక్టర్ కరుణాకర్రాజు, దిశ సభ్యురాలు ఉడుగుల భాగ్యలక్ష్మి, నాయకులు బోయిని రాజు, ఆగిరెడ్డి, గంగాధర్, గట్టగల్ల శ్రీహరి, ఏఎన్ఎం సువర్ణ, ఆశ కార్యకర్తలు వరలక్ష్మి, సుగుణ, పద్మ, ధనలక్ష్మి పాల్గొన్నారు. అలాగే, కుందారంలో అబ్బసాయిలు మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. కరోనాతో బాధపడుతున్న సర్పంచ్ చాడ సుగుణ, ఆమె భర్త మైసయ్య, చాడ పరశురాములు, సజ్జన పెదయాదగిరిని పరామర్శించారు. గుమ్మడవెల్లిలో మాజీ సర్పంచ్ సంగి రజిత, సంగి రాజు కరోనా బారిన పడగా పరామర్శించి ధైర్యం చెప్పారు. జీడికల్లో వెంపెల్లి ప్రభాకర్రెడ్డికి మాతృవియోగం జరుగగా, ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయన వెంట నాయకులు అంతగల్ల రాంచందర్, యాకన్న, ఆగరాజు, కలీల్, గోపాల్దాసు ఉపేందర్, పరకాల రాజు ఉన్నారు.