చిల్పూరు : యాసంగిలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై ఎక్కువగా దృష్టిపెట్టి అధిక లాభాలను పొందాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడ్డవెల్లి కృష్ణారెడ్డి సూచించారు.మండల కేంద్రం మల్కాపూర్ గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ అధికారి నర్సింలు అధ్యక్షతన జరిగిన యాసంగి పంటలపై రైతుల అవగహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు రైతులకు లాభం చేకూర్చేందుకు ప్రత్యామ్నాయ పంటలు పండించుకోవాలని చేస్తున్న సూచనలపై రైతులు దృష్టిని సారించాలని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. రైతుబీమా, రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్కాకతీయ, కాలేశ్వరం నుంచి ప్రతి చెరువుకు నీరు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని కొనియాడారు. పప్పు దినుసులు, వేరు శనగ, పొద్దు తిరుగుడు,నువ్వులు వంటి పంట మార్పిడితో రైతులు అధిక లాభాలను పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొంగ రవి, ఉపసర్పంచ్ బబ్బుల వంశీ, ఎంపీటీసీ మునిపెల్లి సుధాకర్, నియోజకవర్గ కోఆర్డినేటర్ పోలేపల్లి రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.