మేడారం జాతర ఏర్పాట్లు ఘనంగా ఉండాలి
కలెక్టర్ కృష్ణ ఆదిత్య కలెక్టరేట్లో ఏర్పాట్లపై సమీక్ష
గతం కంటే మెరుగ్గా చేపట్టాలని పిలుపు
ములుగుటౌన్, నవంబర్ 26 : ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జరిగే మేడారం మహాజాతరలో ప్రతి అధికారి సైనికుడిలా పనిచేయాలని కలెక్టర్ ఎస్. కృష్ణఆదిత్య అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం ఏర్పాటు చేసిన సెక్టోరియల్ అధికారులు, ఎలక్ట్రిసిటీ, పోలీస్ శాఖ అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంభమేళాను తలపించే గిరిజన జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. జాతరలో తాగునీరు, టాయిలెట్స్, పార్కింగ్ ఏరియా, లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. పార్కింగ్ ఏరియాలు పట్టా భూమిలో ఉన్నాయా? ప్రభుత్వ భూమి లో ఉన్నాయా ? అనే అంశాన్ని గుర్తించాలన్నారు. పట్టా భూమిలో ఏర్పాటు చేసినట్లయితే రైతులతో మాట్లాడి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఏఎస్పీ సాయి చైతన్య మాట్లాడుతూ.. గతంలో పార్కింగ్ ఏరియాలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని వాటిని అధిగమించేలా ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఒక పార్కింగ్ ఏరియాలో ఎన్ని వాహనాలు పార్కింగ్ చేయొచ్చో ముందుగానే ప్లాన్ చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డీఆర్వో రమాదేవి, డీపీవో వెంకయ్య, డీఎల్పీ దేవరాజ్, తాడ్వాయి, వెంకటాపురం(నూ) తహసీల్దార్లు శ్రీనివాస్, నాగరాజు, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, కలెక్టరేట్ ఏవో శ్యామ్ పాల్గొన్నారు.