కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు ఏం తెచ్చారు..?
ఆధిపత్య పోరుతోనే కిషన్రెడ్డి, బండి సంజయ్ పాదయాత్రలు
బీజేపీ నేతల తీరుపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫైర్
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 21 : ‘కేంద్రంలో ఏడేళ్లుగా అధికారంలో ఉంటున్న మీరు తెలంగాణకు ఎన్ని నిధులు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు.. ప్రధాని నరేంద్రమోదీ ఏడాదికి కోటి ఉద్యోగాలిస్తామన్నారు.. అవి ఏమైనవి..’ అని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రశ్నించారు. కాషాయ పార్టీలో ఆధిపత్యపోరులోనే భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పాదయాత్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. శనివారం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ మాచర్ల గణేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ప్రజాదరణను కోల్పోతున్న బీజేపీ నేతలు పోటీపడి పాదయాత్రలు చేపడుతున్నారని రాజయ్య అన్నారు. కేంద్రంలో కేబినెట్ మంత్రి పదవి పొం దిన కిషన్రెడ్డి తెలంగాణకు ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆశీర్వాదం పొందలేని ఆయన తెలుగు రాష్ర్టాల్లో ప్రజాఆశీర్వాద యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దీనికి పోటీగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 24 నుంచి పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎస్సీ వర్గీకరణకు హామీ ఇచ్చి చేసిందేమీలేదన్నారు. నాటి, నేటి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, కిషన్రెడ్డి దళితులకు మొండి చేయి చూపించారని రాజయ్య విమర్శించారు. జన్ధన్ ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.15 లక్షలు జమ చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ ఎంతమందికి ఇచ్చారో బీజేపీ నేతలు పాదయాత్రలో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ను ప్రపంచ దేశాలు సైతం మెచ్చుకుంటున్నాయన్నారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకొస్తున్నదని రాజయ్య విమర్శించారు.
దళితుల సమగ్రాభివృద్ధికే ‘దళితబంధు’
దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాజయ్య వివరించారు. తెలంగాణలోని 15 లక్షల దళిత కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా అమలు చేయని రీతిలో ప్రతిష్టాత్మకంగా దీనిని చేపట్టారని తెలిపారు. దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు అందించేందుకు కృషి చేస్తున్నందుకు హర్షించాల్సి ఉండగా దీనిని అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతున్నదని రాజయ్య మండిపడ్డారు. కాషాయపార్టీ కుట్రలను దళితులు తిప్పికొడుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు మారపాక రవి, ఇల్లందుల బేబి శ్రీనివాస్, చాడా సరితారెడ్డి, గుడి వంశీధర్రెడ్డి, పిట్టల శ్రీలత, ఎంపీపీలు కందుల రేఖాగట్టయ్య, చిట్ల జయశ్రీ, కేసిరెడ్డి సమ్మిరెడ్డి, బొల్లం అజయ్, రడపాక సుదర్శన్, జిల్లా కోఆప్షన్ సభ్యులు మహ్మద్ జుబేదా, కూడా డైరెక్టర్ ఆకుల కుమార్, వైస్ ఎం పీపీ చల్లా సుధీర్రెడ్డి, చిల్పూరు దేవస్థాన చైర్మన్ పొట్లప్లలి శ్రీధర్రావు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తాటికొం డ సురేశ్, పోకల శివకుమార్, కర్ర సమ్మిరెడ్డి, ప్రవీణ్రెడ్డి, రా జ్కుమార్, ‘దిశ’ సభ్యురాలు భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.