జనగామ, మే 4(నమస్తే తెలంగాణ) : పేదింట్లో ఆడపిల్ల పుడితే పెళ్లి చేయడమే భారంగా మారిన తల్లిదండ్రులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఒక గొప్ప వరంగా మారాయి. పెళ్లిళ్లు చేసి అప్పుల పాలైన పేద కుటుంబాలు ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బులతో ఆర్థికంగా నిలదొకుకున్నాయి. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇస్తున్న రూ.లక్షా116తో పాటు తులం బంగారం ఇస్తామని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు అసలు పథకానికే ఎసరు తెస్తున్నది. లబ్ధిదారులకు ఇచ్చిన చెక్కు లు బ్యాంకుల్లో చెల్లుబాటు కావడం లేదు. తులం బంగారం దేవుడెరుగు.. కేసీఆర్ ఇచ్చినట్లు రూ.1,00,116 అయినా ఇవ్వండి మహాప్రభో అంటూ లబ్ధిదారులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న దుస్థితి కాంగ్రెస్ పాలనలో నెలకొంది. జనగామ జిల్లాకేంద్రంలోని సంజయ్నగర్కు చెందిన మోతె బేబీ భర్త ఏడేళ్ల క్రితం చనిపోగా, అప్పటినుంచి కాయకష్టం చేసుకుంటూ పైసా పైసా కూడబెట్టిన సొమ్ము పోగా మరో రూ.4లక్షల అప్పుచేసి గతేడాది ఆగస్టులో కూతురు పెళ్లి ఘనం గా చేసింది.
కల్యాణలక్ష్మి ద్వారా లక్ష రూపాయలు వస్తే చేసిన అప్పులో కొంతమేరకైనా తీరుతుందన్న ఆశతో పథకానికి దరఖాస్తు చేసుకున్నది. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో ఆ లస్యంగా జనవరి నెలలో చెకు వచ్చింది. కానీ, డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్తే అకౌంట్లో డబ్బులు లేవు.. వారం తర్వాత రమ్మని అధికారులు తిప్పి పంపారు. వారం తర్వాత పోతే మళ్లీ అదే సమాధానం చెప్పి పంపించగా, లబ్ధిదారు పలుమార్లు బ్యాంకు చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయింది. తాజాగా, ఏప్రిల్ 18న మళ్లీ బ్యాంకుకు వెళ్లగా చెక్ రిజెక్ట్ అయ్యింది. ఒక వారం ఆగి రమ్మని చెప్పారు. మళ్లీ 24న వెళ్తే చెకు మీద రిజెక్ట్ స్టాంప్ వేసి పంపారు. ఇదేమిటని అడిగిన బేబీని ఎవరికి చెప్పుకుంటావో.. చెప్పుకో నీచెకు రిజెక్ట్ అయ్యిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని బాధితురాలు వాపోయింది. ఒక వైపు పెళ్లి కోసం చేసిన అప్పులకు మిత్తి పెరుగుతుండడంతోపాటు ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేని పరిస్థితితో ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికల ముందు రేవంత్రెడ్డి చెప్పిన తులం బంగారం ఏమొద్దు.. కానీ, మా కేసీఆర్ ఇచ్చినట్లు రూ.లక్షా 116 రూపాలన్న ఇవ్వండి.. అంటూ ఆమె ప్రభుత్వాన్ని వేడుకుంటున్నది.