జియో మార్ట్ డీలర్షిప్ ఆశజూపి ఆన్లైన్లో రూ.8.90 లక్షలు వసూలు
పత్తాలేకపోవడంతో రంగంలోకి పోలీసులు
ఏడాది పాటు ట్రేస్ చేసి కర్నాటక నుంచి రప్పించిన ములుగు పోలీసులు
నిందితుడి నుంచి 3.50 లక్షలు రికవరీ
ములుగురూరల్, ఆగస్టు 14 : ఆన్లైన్లో వ్యక్తిని మోసం చేసి డబ్బులు దండుకున్న సైబర్ నేరగాన్ని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ములుగు ఏఎస్పీ శనివారం విలేకరుల సమావేశం వివరాలు వెల్లడించారు. మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన కొండ వెంకటరాజు సంవత్సరం క్రితం ఆన్లైన్లో వచ్చిన జియో మార్ట్ డీలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. డాక్యుమెంట్స్తో పాటు రూ.8.90లక్షలు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశాడు. కొద్ది రోజుల తర్వాత డీలర్షిప్ విషయమై ఆన్లైన్లో చూడగా అప్లికేషన్ కనిపించలేదు. కంపెనీ వారికి ఫోన్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ లేదు. కాగా, అతడు తరుచూ సంప్రదించే ఫోన్నంబర్ స్విచ్చాఫ్ వచ్చింది. ఈ విషయమై బాధితుడు వెంకటరాజు గత సంవత్సరం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆన్లైన్ మోసగాడిని పట్టుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సీఐ, ఎస్సై, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి సైబర్ నేరగాడు ములుగు జిల్లా కేంద్రానికి వచ్చేలా వ్యూహం పన్నారు. అనుకున్న రీతిలో నిందితుడిని శుక్రవారం ములుగుకు రప్పించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని విచారించగా అతడి పేరు కేవీ మహేంద్ర అని, కర్ణాటక జిల్లా కోడుగు మండలం, చౌటెల్లి గ్రామంలోని కుశాల్నగర్ అని తెలిపాడు. అతడి నుంచి రూ.3.50లక్షల నగదును రికవరీ చేసి జైలుకు పంపించినట్లు ఏఎస్పీ సాయిచైతన్య పేర్కొన్నారు. ప్రజలు సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో సీఐ గుంటి శ్రీధర్, ఎస్సై ఓంకార్ యాదవ్, ప్రొబేషనరీ ఎస్సై రాధిక, సిబ్బంది ఉన్నారు.