Janhvi Kapoor | దివంగత అందాల తార శ్రీదేవి ఎంతో ముచ్చటపడి కట్టుకున్న చెన్నై బంగ్లా త్వరలో అభిమానులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్నది. ఈ విషయాన్ని శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ వెల్లడించింది. బోనీకపూర్తో వివాహం తర్వాత శ్రీదేవి సముద్రానికి అభిముఖంగా విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేసింది. 2018లో ఆమె మరణించే వరకు ఈ బంగ్లాలోనే బోనీకపూర్తో విందు వినోదాలను జరుపుకునేది శ్రీదేవి. ఆమె అకాల మరణంతో ఈ బంగ్లాకు ఆలనాపాలనా లేకుండా పోయింది.
ఇటీవలే ఈ బంగ్లాకు సరికొత్త హంగులతో తీర్చిదిద్ది ఓ ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అభిమానులు ఈ బంగ్లాలో ఉచితంగా బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది జాన్వీకపూర్. ఈ బంగ్లాతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని, అమ్మ చనిపోయే వరకు తన పుట్టిన రోజులన్నీ అక్కడే జరుపుకున్నానని జాన్వీకపూర్ చెప్పింది. ‘ఆతిథ్య రంగంలో పేరున్న సంస్థకు మా బంగ్లా బాధ్యతలు అప్పగించాం. తొలుత కొన్ని రోజుల పాటు అభిమానులు బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఓ కాంటెస్ట్ను నిర్వహించి అందులో గెలిచిన అభిమానులకు ఉచితంగా ఆతిథ్యం అందిస్తాం’ అని జాన్వీకపూర్ చెప్పింది.