Morocco Earthquake | ఆఫ్రికా దేశమైన మొరాకో (Morocco)ను భారీ భూకంపం (Earthquake) కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై భారత్ స్పందించింది. ప్రకృతి విపత్తులో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని మోదీ (Pm Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మొరాకో ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
‘మొరాకోలో భూకంపం అనేక మందిని బలిగొనడం విచారకరం. ఈ విషాద సమయంలో మొరాకో ప్రజల క్షేమం కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నా. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ఈ క్లిష్ట సమయంలో మొరాకోకు సాధ్యమైన సహాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉంది’ అని తెలిపారు.
మొరాకోలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి 296 మంది బలైనట్లు తెలిపింది. మరో 153 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు పేర్కొంది. మర్రకేష్ (Marrakesh)కు 71 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని.. భూ అంతర్భాగంలో 18.5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. ఆల్ హౌజ్, మర్రకేష్, క్వార్జాజేట్, అజిలాల్ సహా పలు ప్రావిన్సుల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు వెల్లడించింది. శతాబ్దకాలంలో ఉత్తరాఫ్రికా ఈ స్థాయి భూకంపాన్ని ఇప్పటి వరకూ చవిచూడలేదని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
Also Read..
Morocco | మొరాకోను కుదిపేసిన శక్తివంతమైన భూకంపం.. 296 మంది బలి
Bridal Shoes | పెండ్లిళ్లకు అమ్మాయిలే కాదు.. వధువుల షూస్ కూడా అందంగా రెడీ అవుతున్నాయి!