న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిసారించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో తన నివాసంలో సోమవారం సమావేశమయ్యారు. ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులపై వారితో చర్చించారు. కీలకమైన పంజ్షీర్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించడం, కొత్త ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి చైనా, పాకిస్థాన్, రష్యాను ఆహ్వానించిన నేపథ్యంలో ప్రధాని మోదీ నిర్వహించిన ఈ కీలక భేటీ ప్రాధాన్యత సంతరించుకున్నది.
మరోవైపు ఆఫ్ఘనిస్థాన్లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా భారతదేశ తక్షణ ప్రాధాన్యతలపై దృష్టిసారించడానికి ప్రధాని మోదీ ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్, ఇతర ఉన్నతాధికారులు ఈ బృందంలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ బృందం ఆఫ్ఘనిస్థాన్లో వాస్తవ పరిస్థితిని, అంతర్జాతీయ ప్రతిస్పందనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని వెల్లడించాయి.