కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ ఎప్పుడైతే తాలిబన్ల( Taliban ) చేతుల్లోకి వెళ్లిపోయిందో అప్పటి నుంచీ రాజధాని కాబూల్లోని హమిద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్లను భరించలేమంటూ వేలాది మంది ఆఫ్ఘన్లు దేశం విడిచి వెళ్లిపోవడానికి ఎయిర్పోర్ట్కు వస్తున్నారు. ఈ క్రమంలో కొందరు తొక్కిసలాటలో, మరికొందరు కాల్పుల్లో, ఇంకొందరు విమానంపై నుంచి పడి చనిపోయారు. అయితే ఎయిర్పోర్ట్ దగ్గర ఈ గందరగోళానికి కారణం అమెరికానే అని తాలిబన్ అధికారి అమీర్ఖాన్ ముతాఖి అన్నాడు. అంత అధికారం, శక్తిసామర్థ్యాలు, వసతులు ఉన్న అమెరికా ఎయిర్పోర్ట్ దగ్గర ఈ పరిస్థితులను నిలువరించలేకపోయింది. దేశం మొత్తం ప్రశాంతంగానే ఉంది. కేవలం కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గరే ఈ గందరగోళం నెలకొన్నది అని అమీర్ ఖాన్ అన్నాడు.
ఆదివారం ఉదయం కూడా కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు చనిపోయారు. ఎలాగైనా దేశం విడిచి వెళ్లాలనుకుంటున్న ఆఫ్ఘన్లు.. అక్కడి అమెరికా దళాలను, జర్నలిస్టులను తమను తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు. గత ఆదివారం నుంచి ఇప్పటి వరకూ ఎయిర్పోర్ట్ దగ్గర 20 మంది మృత్యువాత పడినట్లు నాటో అధికారులు తెలిపారు.