Shubhanshu Shukla | భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్రకు సంబంధించి నాసా మరో కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 22న ప్రయోగం చేపట్టనున్నట్టు ఇస్రో నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగానికి సంబంధించిన టైమ్ను నాసా (NASA) తాజాగా ప్రకటించింది. జూన్ 22న మధ్యాహ్నం 1:12 గంటలకు ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుందని తెలిపింది. ఈ ప్రయోగం ద్వారా భారత్, పోలండ్, హంగేరీకి చెందిన నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (International Space Station) పంపుతున్నారు. ఈ మిషన్కు భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) పైలట్గా వ్యవహరించబోతున్నారు.
అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ ‘యాక్సియమ్’ (Axiom Space) చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్-4’ మిషన్ (Ax 4 mission)లో భాగంగా స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ (SpaceX Falcon 9 rocket) ద్వారా వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. దీంతో ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా ఐఎస్ఎస్కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా శుభాన్షు చరిత్రకెక్కనున్నారు. ఇప్పటికే భారత్కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. రష్యా సహకారంతో అంతరిక్షయానం చేశారు. రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత శుభాన్షు ఈ గౌరవాన్ని దక్కించుకోనున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్ఎస్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. పైలట్గా ఈ యాత్రలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నానని శుక్లా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
పలుమార్లు వాయిదా
సాంకేతిక కారణాలతో యాక్సియం-4 ప్రయోగం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. నిజానికి మే 29నే ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా వాయిదా పడింది. తొలుత ఈ ప్రయోగాన్ని జూన్ 8వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత జూన్ 10, జూన్ 11కు వాయిదా పడింది. యాక్సియం-4 మిషన్కు సంబంధించిన ఫాల్కన్-9 రాకెట్ తనిఖీల్లో ద్రవరూప ఆక్సిజన్ లీకేజ్ కారణంగా జూన్ 11న జరగాల్సిన ఈ ప్రయోగం మళ్లీ వాయిదా వేశారు. లీకేజ్కు సంబంధించిన మరమ్మత్తులు పూర్తిచేసేందుకు మరింత సమయం పడుతుందని, రాకెట్ లాంచింగ్ను వాయిదా వేస్తున్నట్టు స్పేస్ఎక్స్ తెలిపింది.
ఆ తర్వాత ప్రయోగాన్ని జూన్ 19 చేపట్టున్నట్లు ఇస్రో ప్రకటించినప్పటికీ అది ఇప్పుడు మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 22న ప్రయోగం చేపట్టనున్నట్టు ఇస్రో ‘ఎక్స్’వేదికగా బుధవారం వెల్లడించింది. ఈ మిషన్ను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ప్రైవేట్ సంస్థ యాక్సియం స్పేస్ వెల్లడించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో లీకేజ్ల కారణంగా ఇటీవల కొన్ని మరమ్మత్తులు చేపట్టాల్సి వచ్చింది. దీనిపై వివిధ అంశాల్ని ఇస్రో మరోమారు మూల్యాంకనం చేసుకునే విధంగా యాక్సియం-4 మిషన్ ప్రయోగ తేదీని మార్చినట్టు తెలుస్తున్నది.
Also Read..
“శుభాన్షు రోదసి యాత్ర మళ్లీ వాయిదా”
“ఆకాశమే హద్దుగా.. శుభాంశు శుక్లా”
“shubhanshu Shukla | నాలుగు దశాబ్దాల తర్వాత రోదసిలోకి భారత వ్యోమగామి..”