నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లాలోనూ రాత్రి నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. రాత్రి 8గంటల నుంచే షాపుల మూసివేత మొదలైంది. తొలి రోజు కావడంతో పోలీసులు దుకాణాల యజమానులకు విజ్ఞప్తి చేస్తూ సహకరించాలని కోరారు. రాత్రి 9గంటల నుంచి పూర్తి స్థాయిలో కర్ఫ్యూను అమలు చేశారు. అత్యవసర సేవలను మినహాయిస్తే ఇతరులెవరూ బయటకు రాకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యకూడళ్లలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ వాహనాలతో గల్లీల్లో పరిస్థితిని పర్యవేక్షించారు. గతంలో లాక్డౌన్ అనుభావాలతో ప్రజలు కూడా స్వచ్ఛందంగా కర్ఫ్యూకు సహకరిస్తూ కనిపించారు. నేటి నుంచి మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తామని జిల్లా ఎస్పీ రంగనాథ్ ప్రకటించారు. మరోవైపు కరోనా విస్తరణ నేపథ్యంలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లను, మల్టీప్లెక్స్లను మూసివేయాలని యాజమాన్యల అసోసియేషన్లు పిలుపు నిచ్చాయి. వీటితో పాటు కరోనా విస్తరణకు ఆస్కారం ఏర్పడే సముదాయాలపైనా ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది.
మంత్రుల ప్రత్యేక రివ్యూ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పరిస్థితులపై జిల్లా అధికారులు, వైద్యశాఖ ముఖ్యులతో సూర్యాపేటలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలోని కేసుల వివరాలు, వ్యాక్సినేషన్ తీరు, దవాఖానల్లో కొవిడ్ సేవలపై చర్చించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, ప్రజలు అనవసర అపోహలకు గురికావద్దని మంత్రులు సూచించారు.
జిల్లాకు 10వేల డోసులు
జిల్లాలో మంగళవారం మరో పది వేల వాక్సిన్ డోసులు అందుబాటులోకి వచ్చినట్లు డీఎంహెచ్ఓ కొండల్రావు తెలిపారు. ప్రజలు అపోహలకు గురికాకుండా స్వీయనియంత్రణ పాటిస్తూ ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మార్చిలో 857 కేసులు నమోదైతే ఏప్రిల్లో నేటి వరకు 3300 కొవిడ్ కేసులు వచ్చాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఉల్లంఘిస్తే కేసులు
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులను ధరించని వారిపై జిల్లా పోలీసుయంత్రాంగం కఠినంగానే వ్యవహరిస్తున్నది. మాస్క్ లేకుండా బయట తిరిగే వారిపై కేసు నమోదుతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నది. ఈ నెల ఒకటో తేదీ నుంచి మంగళవారం వరకు 2680 మందిపై చర్యలు తీసుకున్నారు. మాస్కులు ధరించకుండా తిరుగుతున్న 1881 మంది నుంచి జరిమానా విధించారు. మరో 799 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. రాత్రి కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.
సైంటిస్టుల భర్తీకి చర్యలు
నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానలో కొవిడ్ వైద్య సేవలు మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా కొవిడ్ ఆర్టీపీసీఆర్ ల్యాబ్లో మూడు సైంటిస్ట్ పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.రాజకుమారి తెలిపారు. ఆసక్తి ఉన్న వారు తన కార్యాలయంలో ఈ నెల 22 నుంచి 26 ఉదయం 10గంటల లోపు సంప్రదించాలని, ఈ నెల 26న జాయింట్ కలెక్టర్ చాంబర్లో నిర్వహించే ఇంటర్యూలకు హాజరుకావాలని కోరారు. ఎండీ(మైక్రోబయాలజీ) లేదా ఎంఎస్సీ(బయో కెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ లేదా బయో టెక్నాలజీ లేదా జెనెటిక్స్) పూర్తి చేసి ఆర్టీ పీసీఆర్ మిషన్పై ఒక సంవత్సరం అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. దీని ద్వారా కొవిడ్ నిర్ధారణకు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.