Indian Students : ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) మధ్య దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. పేలుడు శబ్దాలు, సైరన్ల మోతతో ఇరాన్ నిరంతరం అట్టుడుకుతోంది. దాంతో అక్కడున్న భారత విద్యార్థులు (Indian Students) తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వీలైనంత త్వరగా తమను తీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
‘శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు శబ్దాలతో నేను నిద్రలోంచి ఉలిక్కిపడి లేచా. నాతోపాటు చాలామంది బేస్మెంట్కు పరుగులు తీశాం. అప్పటి నుంచి మాకు నిద్రలేని రాత్రులే మిగిలాయి. ప్రతి రాత్రి పేలుడు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. మేం ఉంటున్న ప్రాంతానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే పేలుడు సంభవించినట్లు తెలిసింది’ అని భారత్కు చెందిన మెడిసిన్ విద్యార్థి ఇంతిసాల్ మొహిదీన్ చెప్పాడు.
22 ఏళ్ల ఇంతిసాల్ టెహ్రాన్లోని షాహిద్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఆ యూనివర్సిటీలో అతడితోపాటు దాదాపు 350 మంది భారత విద్యార్థులున్నారు. అదేవిధంగా ‘ఇక్కడ పరిస్థితి ఏం బాలేదు. రోజూ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి. తాగునీటిని కూడా భద్రపర్చుకోవాలని అధికారులు చెబుతున్నారు. వైద్యులుగా మారేందుకు ఇక్కడికి వచ్చాం. కానీ ఇప్పుడు ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రయత్నించాల్సి వస్తోంది. మమ్మల్ని కాపాడండి ప్లీజ్’ అని మరో విద్యార్థి ఫైజాన్ నబీ ఆవేదన వెలిబుచ్చాడు.
ఇలా ఇరాన్లో ఉన్న భారత విద్యార్థులు ఎవరిని కదిలించినా తమ భయాల గురించే పంచుకుంటున్నారు. ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ (MEA) స్పందించింది. ‘ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితిని అక్కడి భారత ఎంబసీ నిరంతరం గమనిస్తోంది. భారత విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటోంది. కొంతమంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కమ్యూనిటీ నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం’ అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది.
పరిస్థితి మరింత తీవ్రంగా మారితే విద్యార్థులను భారత్కు తరలిస్తామని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ విషయమై ఇప్పటికే ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించింది. భారత విద్యార్థుల తరలింపునకు టెహ్రాన్ అంగీకరించినట్లు చెప్పింది. అయితే ప్రస్తుతం గగనతలం మూసినందున.. భూసరిహద్దుల మీదుగా తీసుకెళ్లవచ్చని చెప్పినట్లు తెలిపింది.