Island of gold | అది ఒక రహస్య ప్రదేశం.. పగడపు దీవి.. అక్కడికి వెళ్లడం అంత సులువు కాదు.. దారి పొడవునా ఎన్నో అవాంతరాలు.. అడుగడగునా అడ్డంకులు.. ఏ కొంచెం ఏమరపాటుగా ఉన్న ప్రాణానికే ప్రమాదం. ఓ రకంగా చెప్పాలంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే ! అలాంటి అన్ని అవాంతరాలు దాటినప్పుడు మాత్రమే కోట్ల విలువైన నిధి సొంతం అవుతుంది ! అబ్బో ఇలాంటి స్టోరీ మాకెందుకు తెలియదు.. ఎన్ని హాలీవుడ్ సినిమాల్లో చూడలేదు.. తెలుగు పాత సినిమాల్లోనూ ఇలాంటి కథ చాలా సార్లు చూశాం అని అనుకుంటున్నారా? అలా అనిపించినప్పటికీ ఇదేదో సినిమా స్టోరీ కాదు.. చందమామ కథ అంతకంటే కాదు.. ఇలాంటి సంఘటన ఇండోనేసియాలోని సుమత్రా దీవుల్లో జరిగింది. ట్రెజర్ హంట్ ( Treasure Hunt )కు వెళ్లిన కొంతమంది మత్స్యకారులకు కోట్ల విలువైన బంగారం.. వెలకట్టలేని వజ్రవైఢూర్యాలు దొరికాయి.
ఇండోనేసియా సుమత్రా ద్వీపంలోని పాలెంబాంగ్ ఉన్న మూసీ నదిలో ఒక రహస్య దీవి ఉంది. దీనికి బంగారు ద్వీపం ( Island of Gold ) అనే పేరు కూడా ఉంది. ఇందుకు కారణం అక్కడి ఇతిహాసాల ప్రకారం ఆ ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నాయని ప్రతీతి. అక్కడి దీవిలో బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు, రత్నాలు, పగడాలు, బంగారపు ముద్దలు ఇలా కోట్ల విలువైన నిధి ఉందని ఎప్పట్నుంచో కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. అయితే అవన్నీ కథలే అని చాలామంది కొట్టిపారేసేవారు. కానీ అవి నిజాలు అని నమ్మేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. కానీ ఆ నదిలో మొసళ్లు ఇబ్బడిముబ్బడిగా ఉండటంతో వాళ్లు సాహసించలేకపోయారు. కొంతమంది సాహసించి నిధి కోసం వేట సాగించేవారు. కానీ ఎవ్వరికీ ఆ నిధి దొరకలేదు. దీంతో మళ్లీ మళ్లీ ప్రయత్నించినా విఫలమయ్యారు.
ఇలా నిధి కోసం చాలామంది ప్రయత్నించి విఫలం కావడంతో నిధిని దక్కించుకోవాలనే ఆశను వదిలేసుకున్నారు. కానీ కొందరు మత్స్యకారులు మాత్రం ఎలాగైనా ఆ నిధిని సంపాదించాలని కంకణం కట్టుకున్నారు. ఆ నది మొత్తం నిధి కోసం అన్వేషించారు. బంగారు దీవి కోసం ఐదేండ్లుగా పట్టువదలని విక్రమార్కుల్లా అడుగడుగు వెతుకుతూనే ఉన్నారు. చివరికి వారి ప్రయత్నం ఫలించింది. బంగారు దీవి వారి కంటపడింది. మొత్తం విలువైన రత్నాలు, నాణేలు, బంగారు ఉత్సవ విగ్రహాలు, కాంస్య గంటలు, బంగారం ముద్దలతో నిండి ఉన్న ఆ దీవిని చూడగానే వాళ్ల కండ్లు మెరిసిపోయాయి. తమ కల నెరవేరిందని ఎంతో సంబురపడిపోయారు. ఎన్నో ఏండ్లుగా ఒక కట్టుకథగా మిగిలిపోయిన నిధిని సాధించామని ఉప్పొంగిపోయారు.
మత్స్యకారులకు దొరికిన నిధిలోని బుద్ధుని విగ్రహం ఆధారంగా.. ఆ సంపద మొత్తం శ్రీవిజయ నాగరికతకు చెందినదిగా అంచనా వేస్తున్నారు. ఆ బుద్ధుని విగ్రహం 8వ శతాబ్దానికి చెందిన రత్నాలతో అలంకరించి ఉండటమే ఇందుకు కారణం. ఈ ఒక్క విగ్రహం విలువే మిలియన్ పౌండ్లు ఉంటుందని అంచనా. అంటే ఆ మొత్తం నిధి విలువ ఎంత ఉంటుందో ఇక ఊహించండి.. ఆ విలువ ఊహలకు కూడా అందదు. లక్షల కోట్లకు పైగానే ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఇప్పటివరకు బయటపడ్డ అత్యంత నిధుల్లో ఇది ఒకటి. ఈ విషయాన్ని ఆర్కియాలజిస్టులే చెబుతున్నారు.
ఈ గుప్త నిధి శ్రీ విజయ నాగరికతకు చెందిందని తెలుస్తోంది. క్రీ.శ. 7వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు శ్రీ విజయ సామ్రాజ్యం ఎంతో వైభవంగా విలసిల్లింది. ఈ సామ్రాజ్యంలోని ఇండ్లు, రాజభవనాలు, ఆలయాలు అన్నీ చెక్క పడవలపైనే నిర్మించారంట. అందుకే ఇది వాటర్ వరల్డ్గా కూడా ప్రసిద్ధి చెందింది. కానీ హఠాత్తుగా ఈ సామ్రాజ్యం కాలగర్భంలో కలిసిపోయింది. ఈ నాగరికత అంతరించినప్పుడే.. ఆ సామ్రాజ్యంలోని ఇండ్లన్నీ నీటమునిగిపోయాయి. అయితే ఈ సామ్రాజ్యం ఎలా కనుమరుగైందనే దానిపై కచ్చితమైన ఆధారాలు మాత్రం తెలియవు. ఇండోనేసియా అగ్ని పర్వతాల పేలుడు వల్ల లేదా వరదలు ముంచెత్తడం వల్ల శ్రీ విజయ సామ్రాజ్యం అంతరించి ఉండొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. కానీ కచ్చితమైన ఆధారాలు మాత్రం దొరకలేవు. దీంతో శ్రీ విజయ సామ్రాజ్యం కల్పితమనే వాదనలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో బంగారు దీవి బయటపడటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జననేంద్రియాలు.. ఆమె పుట్టుక ఇప్పటికీ మిస్టరీనే
Tavolara | ఆ రాజ్యంలో ఉండేది కేవలం 11 మందే.. మరి రాజుగారి పనేంటో తెలుసా !
అబ్రహం లింకన్ గడ్డం పెంచడం వెనుక ఉన్న కథేంటో తెలుసా !
ఆ 2 ద్వీపాల మధ్య దూరం 4 కిలోమీటర్లే.. కానీ ఎలా వెళ్లినా ఒకరోజు పడుతుంది.. ఎందుకలా
Honeymoon | రెండు దేశాల మధ్య బెడ్.. రొమాంటిక్గా హనీమూన్.. ఎక్కడో తెలుసా?