ఆమనగల్లు, ఏప్రిల్2: పల్లెలు.. దేశానికి పట్టుగొమ్మలు అన్న మహాత్ముడి మాటలు నిజం చేస్తూ.. పంచాయతీలకు ప్రభుత్వం అధికారాలను కట్టబెట్టింది. గ్రామాల్లో జరిగే పనులన్నీ పంచాయతీ పాలకవర్గం తీర్మానం మేరకు చేపట్టేలా అధికారాలు ఇచ్చింది. పంచాయతీ రాజ్ చట్టంలో భాగంగా ఇటీవల కొత్త జీవో 18ను విడుదల చేసింది. దీంతో ఎన్ని రూ.లక్షల పనైనా పంచాయతీ పాలకవర్గం తీర్మానించుకుని చేసుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు కొత్త అధికారం కట్టబెడూతూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. గతంలో అభివృద్ధి పనులు చేసి నిధులు డ్రా చేయాలంటే సర్పంచులు అవస్థలు పడేవారు. కొత్త పనులు చేపట్టాలన్నా పంచాయతీ తీర్మానంతోపాటు ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరిగా ఉండేది. దీంతో తీర్మానాలు చేయించడం ఒక ఎత్తు అయితే వాటిని అమలు చేయించుకుని నిధులు డ్రా చేసుకునేందుకు అధికారుల చుట్టూ ప్రదిక్షణలు చేసేవారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధుల విడుదల నిబంధనతో తలెత్తుతున్న జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇకనుంచి పాలకవర్గం తీర్మానం ఉంటే చాలు అభివృద్ధి పనులు చేసుకోవచ్చు. సర్పంచుల సమస్యలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్పంచుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పంచాయతీ తీర్మానమే ప్రధానం
రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీ రాజ్ చట్టం తీసుకొచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేస్తున్నది. రూ.2లక్షల వరకు అభివృద్ధి పనులు చేసేందుకు పంచాయతీ తీర్మానం చేసుకుంటే సరిపోయేది. కానీ రూ.3లక్షల వరకు పనులు చేయాలంటే మాత్రం డీఎల్పీవో ద్వారా అనుమతి పొందాల్సి వచ్చేది. రూ.10లక్షల వరకు పనులు చేసుకోవాలంటే కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సిందే. ఈ కారాణాలతో పనుల్లో జాప్యం జరిగేది. పంచాయతీ పాలక వర్గాలు ఒక పనిని రెండు, మూడు ముక్కలుగా చేసి నిర్వహించేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితికి చెక్ పెడుతూ పంచాయతీ అవసరాల నిమిత్తం ఎంత పెద్ద పనులైనా చేసుకునేలా అవకాశం లభించింది. జీవో 18తో రూ.20 లక్షల పని చేయాలన్నా పంచాయతీ తీర్మానం సరిపోతుంది.
మేజర్ పంచాయతీలకు ఎంతో మేలు
మేజర్ గ్రామ పంచాయతీలకు ఈ విధానం ద్వారా మేలు కలుగనుంది. వీటికి వివిధ పథకాల కింద నిధులు సమకూరుతాయి. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం నిధులు భారీగా వస్తున్నాయి. వాటిని పంచాయతీ అవసరం నిమిత్తం ఖర్చు చేసుకోవచ్చు. గతంలో మాదిరిగా ఉన్నతాధికారుల అనుమతి అవసరం ఉండదు. పంచాయతీ పాలకవర్గం నిర్ణయంతోనే పెద్ద పనులు నిర్వహించుకునే అవకాశం కలిగింది.
పల్లెలకు వన్నె తెచ్చేలా పనిచేస్తాం
గ్రామ సభ తీర్మానం ద్వారా నిధులు పంచాయతీలో ఖర్చు చేసుకునే వేసులుబాటు కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం. గ్రామాన్ని అభివృద్ధి చేసుకొనేందుకు సర్పంచులు పోటీ పడుతారు. మంగళపల్లిలో చాలా అభివృద్ధి పనులు చేస్తు న్నాం. నిధులు జాప్యం కారణంగా పనులు నిలిచిపోతున్నాయి. ఇక నుంచి పంచాయతీల్లో ఆమోదం పొందిన తరువాత తీర్మానం చేసి పారదర్శకంగా నిధులు ఖర్చు పెట్టుకుంటాం. నిధుల గోల్మాల్ కాకుండా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం.
– నర్సింహారెడ్డి, సర్పంచ్, మంగళపల్లి, ఆమనగల్లు
అభివృద్ధికి కొత్త జీవో అనుకూలం..
పంచాయతీ పరిధిలో పెద్ద పాటి అభివృద్ధి పనులు చేసుకోవాలంటే అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. దీంతో నెలల తరబడి పనులు మంజూరు కాక అభివృద్ధి కుంటుపడేది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలులోకి తీసుకొచ్చిన కొత్త జీవో నంబర్ 18 ప్రకారం పాలక మండలి కలిసికట్టుగా అభివృద్ధి పనులను త్వరితగతిన చేసుకునే అవకాశం ఏర్పడింది. గ్రామాల అభివృద్ధికి తోడ్పడే కొత్త జీవో అమలు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు సర్పంచ్ల అందరి తరఫున ధన్యవాదాలు.
– సయ్యద్ అంజద్, సర్పంచ్, పర్సాపూర్, కొడంగల్.
గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి
జీవో 18తో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయి. గతంలో రూ.2 లక్షలకు పైగా అభివృద్ధి పనులు చేయాలంటే డీఎల్పీవో, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల పనులకు జిల్లా అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉండేది. ప్రస్తుతం పంచాయతీ తీర్మానంతో మరింత వేగంగా అభివృద్ధి జరుగుతుంది. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ఈ జీవో గ్రామాల అభివృద్ధికి దోహదపడుతుంది. సర్పంచ్లు మరింత ఉత్సాహంతో గ్రామాభివృద్ధిలో నిమగ్నమవుతారు.
– విజయలక్ష్మి, సర్పంచ్, మల్కాపూర్, తాండూరు
ఇవీ కూడా చదవండి
జడ్చర్లలో వాటర్ హీటర్ ప్లాంట్
సామాన్యుడికి వాహన యోగం దూరం : ఏప్రిల్ నుంచి బైక్లు, కార్ల ధరలకు రెక్కలు!