న్యూఢిల్లీ : పెట్రో ధరల షాక్తో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే తాజాగా కారు, బైక్ల ధరలు పెరగనుండటం మరింత భారం కానుంది. ఇంధన ధరలతో పాటు ముడిపదార్ధాలు, మెటల్ ధరలు పెరగడంతో వాహన ధరలకు రెక్కలు రానున్నాయి. ఆర్థిక వ్యవస్ధ క్రమంగా కొవిడ్-19కు ముందున్న పరిస్ధితికి చేరుకుంటుండటం కూడా వాహనాలకు డిమాండ్ పెంచుతోంది. ముడిపదార్ధాల ధరలు పెరగడంతో తమ వాహనాల ధరలను పెంచకతప్పడం లేదని వచ్చే నెల నుంచి తమ కార్ల ధరలు పెరుగుతాయని దేశంలో అతిపెద్ద కారు తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రకటించింది.
ఏడాది కాలంగా ముడిపదార్ధాల ధరలు ఎగబాకడం కంపెనీ వాహనాల తయారీ వ్యయం పెరిగిందని, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అదనపు వ్యయంలో కొంత భాగాన్ని ధరల పెంపు ద్వారా కస్టమర్లకు మళ్లిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ముడిపదార్ధాల ధరలతో పాటు పెట్రో ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరగడంతో వాహనాలను కస్టమర్లకు చేర్చే సరఫరా వ్యయాలు పెరగడం కూడా ఆటోమొబైల్ కంపెనీలకు భారమైంది. ఇక ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ సైతం తమ వాహనాల ధరను పెంచేందుకు యోచిస్తోంది. ఏప్రిల్ నుంచి తమ బైక్లు, స్కూటర్ల ఎక్స్షోరూం ధరలు పెరుగుతాయని కంపెనీ గతంలో ప్రకటించింది.
ముడిపదార్ధాల ధరలు పెరగడంతో వాహనాల ధరలు పెంచకతప్పడం లేదని కంపెనీ పేర్కొంది. ముడిపదార్ధాల ధరలు పెరగడంతో ఏప్రిల్ నుంచి తమ కార్ల ధరలను పెరుగుతాయని ఆటోమేకర్ నిస్సాన్ ఇండియా మంగళవారం పేర్కొంది. ఆటో విడిభాగాల ధరల పెరుగుదల కొనసాగుతుండటంతో అనివార్యంగా నిస్సాన్, డాట్సన్ మోడల్స్ అన్నింటిపై ధరల పెంపు చేపట్టక తప్పలేదని కంపెనీ తెలిపింది.