నిమిషానికి రూ.860 కోట్లు ఆవిరైన మదుపరుల సంపద
కరోనాతో కుదేలైన స్టాక్ మార్కెట్లు…
ముంబై, మార్చి 24: కరోనా భయాలతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా మరోసారి మహమ్మారి కేసులు పెరుగుతున్నాయన్న వార్త మదుపరులను అమ్మకాల వైపు నడిపించింది. ఉదయం 49,786 వద్ద ప్రారంభమైన 30 షేర్ల ఇండెక్స్ ఒక దశలో 49,120 కనిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 871 పాయింట్లు నష్టపోయి 49,180 వద్ద స్థిరపడింది. గత నెల రోజుల్లో ఒక్క సెషన్లో ఇంతస్థాయిలో పతనమవడం ఇదే తొలిసారి. సెన్సెక్స్తోపాటు నిఫ్టీ కూడా భారీగా పతనమైంది. 265.35 పాయింట్లు (1.79 శాతం) కుంగి 14,549.40 వద్ద ముగిసింది. గత ఆరు వారాలుగా తగ్గుతూ వచ్చిన కేసులు మళ్లీ పెరుగుతుండటంతో మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. ఫలితంగా అమ్మకాలు పోటెత్తడంతో పెట్టుబడిదారుల సంపద నిమిషానికి రూ.860 కోట్ల చొప్పున కోల్పోయారు. మొత్తంగా రూ.3.27 లక్షల కోట్ల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.202.53 లక్షల కోట్లకు దిగింది.
మహీంద్రా అత్యధికంగా 4 శాతం తగ్గి టాప్ లూజర్గా నిలిచింది. దీంతోపాటు ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఎల్అండ్టీలు నష్టపోయాయి.
రియల్టీ, మెటల్, ఆటో, బ్యాంకింగ్, ఇండస్ట్రీయల్, ఫైనాన్స్ రంగ షేర్లు మూడు శాతం వరకు క్షీణించాయి.
బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు రెండు శాతం నష్టపోయాయి.
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు తగ్గి 72.55 వద్ద నిలిచింది.