అమరావతి : సింహాచలంలోని సింహాద్రి అప్పన్న చందనోత్సవం వేడుక శుక్రవారం వైభవంగా జరిగింది. వైశాఖ శుద్ధ తదియ సందర్భంగా శుక్రవారం స్వామివారు నిజరూపంలో దర్శనమిచ్చారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వేడుకను ఏకాంతంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అవంతి శ్రీనివాస్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించగా.. ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు తొలిదర్శనం చేసుకున్నారు. చందనోత్సవం సందర్భంగా భక్తుల పేరిట ఆలయ కల్యాణ మండపంలో గోత్రనామ పూజలు నిర్వహించారు. ఏటా చందనోత్సవం వేడుక అంగరంగ వైభవంగా జరిగేది. ఏడాదికోమారు స్వామివారు నిజరూపంలో దర్శనం ఇస్తుండగా.. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే వారు. గత రెండేళ్లుగా కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో రెండేళ్లుగా ఉత్సవం ఏకాంతంగానే సాగుతోంది.