Whatsapp | న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: చాట్లు, కాల్స్, వీడియోలు, ఫైల్స్, వంటి వాటిని గోప్యంగా ఉంచే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని వదులుకోమని ఒత్తిడి చేస్తే భారత్లో తమ సేవలు నిలిపివేయాల్సి వస్తుందని వాట్సాప్ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ ఆండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ – 2021లోని 4(2) నిబంధనను సవాల్ చేస్తూ వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ఏదైనా పోస్ట్ లేదా మెసేజ్ మొదట ఎవరి వద్ద నుంచి వచ్చింది, ఎవరు దాని సృష్టికర్త అనేది సోషల్ మీడియా సంస్థలు గుర్తించాలని(ట్రేసబులిటీ) ఈ నిబంధన చెప్తున్నది. అయితే, ఇలా చేయాలంటే కోట్లాది మెసేజ్లను కొన్ని ఏండ్ల తరబడి స్టోర్ చేయాల్సి ఉంటుందని, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి నిబంధన లేదని వాట్సాప్ తరపు న్యాయవాది తేజస్ కరియా ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పైగా ఎండ్ టూ ఎండ్ ఎంక్రిప్షన్(ఎక్కడా మెసేజ్ స్టోర్ అవకుండా నేరుగా పంపించిన వారి నుంచి అందుకునే వారికి వెళ్లడం) విధానానికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు.
ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వల్ల తమ చాట్లు, సమాచారం, ఫైల్స్ వంటివి గోప్యంగా ఉంటాయనే నమ్మకంతోనే భారత్లో కోట్లాది మంది వినియోగదారులు వాట్సాప్ను వినియోగిస్తున్నారని, దీనికి భంగం కలిగే పరిస్థితే వస్తే తమపై వినియోగదారుల నమ్మకం దెబ్బతింటుందని వివరించారు. 4(2) నిబంధన వల్ల ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని బలవంతంగా తొలగించాల్సి వస్తుందని, ఇలా చేయమని చెప్తే వాట్సాప్ భారత్ను వదిలి వెళ్తుందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. 4(2) నిబంధన వ్యక్తుల గోప్యతకు కూడా వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. కాగా, 2021 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త ఐటీ నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. అన్ని సోషల్ మీడియా సంస్థలు ఈ నిబంధనలు పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిబంధనల్లో కొన్నింటిని సోషల్ మీడియా సంస్థలు వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించాయి. ఇటీవల సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది.