Akhilesh Yadav : నీట్ పేపర్ లీకేజీ అంశంలో ప్రధాన మంత్రి మోదీని కాపాడటానికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించారు అని ఎస్పీ ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై, కొత్తగా ప్రవేశపెడుతున్న యాంటీ పేపర్ లీక్ అమెండ్మెంట్ బిల్లుపై మంగళవారం పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లోక్సభలో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
ఈ అంశంలో ప్రధాన మంత్రిని రక్షించేందుకు ప్రధాన్ను తొలగించారు అని అఖిలేష్ అన్నారు. ‘‘చట్టం అంత బలంగా ఉంటే బీజేపీ పదేళ్ల పాలనలో 20 పేపర్ లీకేజీలు ఎలా జరిగాయి..? ఈ విషయంలో దోషులను రక్షించేవారిని ఎలా నమ్ముతాం. ఇప్పుడు తీసుకొస్తున్న కొత్త బిల్లు.. పాత బిల్లుకు చిన్న సవరణ మాత్రమే. అలాంటి ఈ బిల్లుతో ఎవరిని మోసం చేయాలి అనుకుంటున్నారు. నేను ఎమర్జెన్సీని చూడలేదు. కానీ, దేశ రాజధానిలో ఇప్పుడేం జరిగిందో మాత్రం చూశా. ప్రభుత్వం టియర్ గ్యాస్ షెల్స్ వంటి ఆయుధాల్ని విద్యార్థుల్ని అణచివేయడానికి వాడింది. మంత్రి పదవికి రాజీనామా చేసిన దర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్కు వస్తుంటే ఆయనకు పూలదండలతో స్వాగతం పలుకుతున్నారు’’ అంటూ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం కొన్నింటికి తలొగ్గుతుందని, కానీ, ఈ విషయంలో ప్రభుత్వం తలవంచడానికి ఎవరో ఒకరు అవసరం అంటూ అఖిలేష్ అన్నారు.
పార్లమెంట్లో నీట్ పేపర్ లీకేజీతోపాటు, కొత్త బిల్లుపై 10 గంటలపాటు చర్చ జరగనుంది. మంగళవారం రాత్రి 10.00 గంటల వరకు కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక, ఈ బిల్లు బుధవారం లోక్సభలో ఆమోదం పొందే అవకాశం ఉంది. ఎస్పీ, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఈ కొత్త బిల్లు పేపర్ లీకేజీలను అరికట్టేంత బలంగా లేదని అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల వాదనను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అనేది చూడాలి.