అవసరమైతే మరిన్ని కేంద్రాల ఏర్పాటు
వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత
వరంగల్రూరల్, ఏప్రిల్ 17(నమస్తేతెలంగాణ) : కరోనా నిబంధనలు పాటిస్తూ రైతులకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం హరిత అధికారులకు సూచించారు. కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా అవసరమైతే మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో జిల్లా ప్రొక్యూర్మెంట్ కమిటీ సభ్యులు, ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు, రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం యాసంగి ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 194 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్తో జిల్లాలో అదనంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎఫ్ఏక్యూ ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని డీఆర్డీవో, డీసీవో, ఓడీసీఎంఎస్, ఏఎంసీలను ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో మౌలిక వసతులు కల్పించాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు.
కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి సెంటర్లో కరోనా జాగ్రత్తలు, తాలు, తేమ తదితర అంశాలపై రైతులకు అవగాహన కలిగేలా సమాచారంతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలన్నారు. గోనె సంచులు తగినన్ని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ భాస్కర్ను ఆదేశించారు. టోకెన్ల ప్రకారం గన్నీ సంచులను పంపిణీ చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్మిల్లులకు ధాన్యాన్ని రవాణా చేసే ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు లారీల కొరత లేకుండా చూసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులు తప్పనిసరిగా ఎఫ్ఏక్యూ ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తేవాలని కోరారు. అదనపు కలెక్టర్ ఆర్ మహేందర్రెడ్డి, డీఆర్డీవో ఎం సంపత్రావు, జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి భవాని, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ భాస్కర్, రైస్మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంపత్కుమార్, వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.