నర్సపురం వద్ద పేదవాడి కలల సౌధం
3460 ఇండ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం
ఇప్పటికే 1604మంది లబ్ధిదారుల గృహ ప్రవేశం
సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
రెండో దశలో మరికొంత మంది అర్హులకు అందజేత
సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 23:గరీబోడు గర్వపడేలా అధునాత వసతులతో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తున్నది. సిద్దిపేట సమీపంలోని నర్సపురం వద్ద గేటెడ్ కమ్యూనిటీ తరహా పేదవాడి కలల సౌధం సిద్ధం చేసింది. 3460 ఇండ్ల నిర్మాణం చేపట్టి, మొదటి దశలో అర్హులైన వారిని ఎంపిక చేసింది. ఇప్పటికే 1604మంది లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయగా, రెండో దశలో మరికొంత మందిని అధికార యంత్రాంగం ఎంపిక చేయనున్నది. ఇండ్లను సీఎం కేసీఆర్ ప్రారంభించగా, రూపాయి ఖర్చులేకుండా పేదలకు అందించింది. అర్హుల ఎంపికనూ అత్యంత పారదర్శకంగా చేపట్టగా, లబ్ధిదారుల్లో ఆనందం నెలకొంది. ఇండ్లను ముఖ్యమంత్రి అందించగా, లబ్ధిదారులు కాలనీకి ‘కేసీఆర్నగర్’ అని పేరు పెట్టుకొని, తమ అభిమానాన్ని చాటారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా..
దేశంలో మరెక్కడా లేని విధంగా సకల సౌకర్యాలు.. పెద్దపెద్ద నగరాల్లో సైతం చూడని విధంగా ఇండ్లను నిర్మించి నిరుపేదలకు ఉచితంగా అందించారు. సిద్దిపేట పట్టణంలోని నర్సపురం వద్ద 3460 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. 45 ఎకరాల విస్తీర్ణంలో 205 బ్లాక్లలో జీ+2 పద్ధతిలో అద్భుతమైన రీతిలో ఇండ్లు నిర్మించారు. రెండు బెడ్ రూంలు, ఒక హాలు, రెండు బాత్రూమ్లు, ఒక వంట గది ఇంటి చుట్టూ విశాలమైన స్థలం ఉండేలా పక్కా ప్రణాళికలు చేశారు. అంతే కాకుండా ప్రతి ఇంటికి గ్యాస్ సరఫరా పైప్ లైన్, 24 గంటల తాగునీరు, కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, విద్యుత్ సౌకర్యం, సమీకృత మార్కెట్లు, పార్కులు, ఎల్ఈడీ లైట్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, హరితహారం మొక్కలు, ప్రజల వైద్య సౌకర్యార్థం బస్తీ దవాఖాన, పోలీస్ ఔట్ పౌస్టు ఇలా అన్ని సౌకర్యాలు కల్పించారు. కాలనీ ప్రజల సౌకర్యార్థం మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించారు. గేటెడ్ కమ్యూనిటీ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా మంత్రి హరీశ్రావు నిరంతర పర్యవేక్షణతో ఇండ్లను నిర్మించారు. సుమారు 400 సార్లు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పర్యవేక్షించి, పరిశీలించి అధికారులను దిశానిర్దేశం చేయడంతో ఇండ్ల నిర్మాణం సులభమైంది. ఇండ్లు అందించడమే కాకుండా ప్రతి ఇంటికి సంబంధించిన 5 రకాల పత్రాలను కూడా అందజేశారు. ఇంటి పట్టా, గ్యాస్ కనెక్షన్, కరెంట్ మీటర్, మున్సిపాలిటీకి సంబంధించి పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ పత్రాల కోసం లబ్ధిదారులు ఎక్కడా తిరిగే పని లేకుండా పూర్తి ఉచితంగా ప్రభుత్వమే అందజేసింది. మొదటి దశలో ఇప్పటికే 1604 మంది అర్హులకు అందించారు. సీఎం కేసీఆర్ ఆలోచన, మంత్రి హరీశ్రావు ప్రత్యేక కృషితో సిద్దిపేట పట్టణ పరిధిలోని నర్సాపూర్ వద్ద గేటెడ్ కమ్యూనిటీ తరహా అధునాతన సౌకర్యాలతో ఇండ్లను నిర్మించారు.
పారదర్శకంగా ఎంపిక..
గూడు లేని గరీబోళ్లకే ఇల్లు దక్కాలనే సీఎం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా డబుల్ బెడ్రూం ఇండ్ల ఎంపిక జరిగింది. ఇందులో భాగంగా 144 మంది ప్రభుత్వ అధికారులు 20 బృందాలుగా ఏర్పడి నాలుగు నెలల పాటు అత్యంత పారదర్శకంగా టెక్నాలజీని వినియోగించి, పరిశోధించి అర్హులను ఎంపిక చేశారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా 5 సార్లు వడపోత చేసి అర్హులను ఎంపిక చేసి ఆయా వార్డుల్లో లబ్ధిదారుల పేర్లను ప్రదర్శించారు. అంతే కాకుండా సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి గృహ ప్రవేశం చేయించారు. రెండో దశలో మరికొంత మంది లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్ రూం ఇండ్లను అందజేయ నున్నారు.