కొత్తగూడెం క్రైం : ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగలూరు దండకారణ్యంలో మావోయిస్టులు రహస్యంగా సమావేశమవుతున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు దాడి చేశాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. గంగలూరు పోలీస్స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులు ప్లీనరీ నిర్వహించేందుకు సమావేశవుతున్నట్లుగా పోలీస్ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దంతేవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాల నుంచి జిల్లా రిజర్వు గార్డ్స్(డీఆర్జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా, సీఆర్పీఎఫ్ విభాగాల నుంచి 1,200 మంది సైన్యంతో గంగలూరు పరిధిలోని అడవులను జల్లెడ పట్టారు. ఈ క్రమంలో పీడియా అడవుల్లో భద్రతా దళాల రాకను గమనించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. అప్పటికే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. భద్రతా దళాల నుంచి తప్పించుకునే మార్గం లేకపోవడంతో మావోయిస్టులు కాల్పులతోనే సుమారు రెండున్నర గంటలపాటు పోరాడినట్లు తెలుస్తోంది. జవాన్ల ధాటి పెరుగుతుండటంతో మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే గుట్టల మీదుగా దట్టమైన అటవీ మార్గంలోకి పారిపోయినట్లు సమాచారం. కాల్పుల విరమణ తర్వాత జవాన్లు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారని ప్రాథమికంగా తెలుస్తోంది. మావోయిస్టుల మృతదేహాలతోపాటు వారికి సంబంధించిన భారీ ఆయుధ, వస్తు సామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే సమావేశంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత ఉన్నాడనే పక్కా సమాచారంతోనే జవాన్లు ఆ ప్రాంతంపై ముప్పేట దాడి చేసినట్లు తెలుస్తోంది. హార్డ్కోర్ నక్సల్ కమాండర్లు లింగా, పాపారావుతోపాటు మరికొందరు కీలక నేతలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టులు ఎవరు? అనే విషయాలపై పోలీస్ అధికారులు ఆరా తీస్తున్నారు. మృతుల్లో కొందరిని గుర్తించినా వారి వివరాలను పోలీసు అధికారులు ఇంకా వెల్లడించలేదు.