MLC Tata Madhu | స్పీకర్ను కించపరిచేలా నేను మాట్లాడలేదు.. అలాంటి కుసంస్కారం నాకు లేదని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. అసెంబ్లీకి వెళ్తుంటే తమపై జరిగిన పోలీసుల దౌర్జన్యం గురించి ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. నన్ను బర్తరఫ్ చేయాలా, సస్పెండ్ చేయాలా, అరెస్ట్ చేయాలా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎమ్మెల్సీ పదవి కోసం నేనే బాధపడడం లేదు. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై జరిగిన దాడిని కప్పిపుచ్చేందుకే నాపై ఆరోపణలు చేస్తున్నారు. మీకు దమ్ముంటే ప్రజా సమస్యల మీద మాట్లాడండి.. తాతా మధు అనని మాటలను డైవర్ట్ పాలిటిక్స్ కోసం వాడుతున్నారని మండిపడ్డారు.
స్పీకర్, చైర్మన్పై నాకు అపారమైన గౌరవముంది. మీరు శాసన సభ్యులు.. మేమూ శాసన సభ్యులం.. రేపు మీరు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మీ గౌరవానికి భంగం కలిగినప్పుడు మీరు కూడా అదే ఫీల్ అవుతారు కదా.. నేను నిన్ననే ఆస్పత్రి నుంచి వచ్చాను.. సొమ్మసిల్లి పడిపోయాను.. నేను కింద పడ్డప్పుడు ఒకడు నా ప్యాంటు పట్టుకొని లాగేస్తున్నడు.. ఒకరు కాళ్లు పట్టి గుంజుతున్నారు.. ఆ సందర్భంలో నన్ను నేను రక్షించుకోవడం కోసం మాట్లాడాల్సి వచ్చింది. నాపై హత్యాయత్నం చేసిన కొందరి పోలీసులను ఉద్దేశించి మాత్రమే మాట్లాడాను. నన్ను నేను రక్షించుకోవడం కోసమే అలా మాట్లాడాను. పోలీసులపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు స్పీకర్కు ఆపాదిస్తున్నారని ఎమ్మెల్సీ తాతా మధు వాపోయారు.
నేను స్పీకర్ను ఉద్దేశించి అన్నట్టు భావిస్తే ఆ మాటలను ఉపసంహరించుకుంటున్నా.. దీనిపై నేను విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు.
ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలి : డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్