రుద్రంపూర్, సెప్టెంబర్ 07 : పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ) రామవరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ తుకారాం రాథోడ్, డీపీఎంఓ మోహన్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందితో ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణపై సమీక్ష నిర్వహించి అవగాహన కల్పించారు. సమతుల్య ఆహారం తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని డీఎంహెచ్ఓ తెలిపారు. ఆకుకూరలు, సీజనల్ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు దినుసులు, సులభంగా జీర్ణమయ్యే మాంసకృత్తులతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.
వైట్ రైస్, తీపి పదార్థాలు, కూల్డ్రింక్స్, పిజ్జాలు, బర్గర్లు, నూడుల్స్, ఫాస్ట్ఫుడ్ వంటి వాటిని పరిమితంగా తీసుకోవాలన్నారు. షుగర్, బీపీ వంటి జీవనశైలి వ్యాధుల నియంత్రణకు వయసుకు తగిన వ్యాయామం, యోగా, రోజువారీ నడక ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రతిరోజూ 7–8 గంటల నిద్ర అవసరమని పేర్కొన్నారు. ఉప్పు వినియోగాన్ని తగ్గించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. అవయవ దానం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని, అవయవ దానం గొప్ప మానవతా దానమని డీఎంహెచ్ఓ పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు.