Inspiration | చాలామంది విద్యార్థులు ఇరవైలలో కాలేజీ జీవితం అనుభవిస్తుంటారు. లేదంటే, కొలువులు సాధించే ప్రయత్నంలో ఉంటారు. హైదరాబాదీ అప్పల్ల సాయికిరణ్ మాత్రం స్టార్టప్ ప్రపంచంలో తనకంటూ ఓ స్థానం సృష్టించుకున్నాడు. ఈ విద్యార్థి ఆంత్రప్రెన్యూర్ ‘స్కోప్ యాప్’ అనే సంస్థను స్థాపించాడు. దానికి సీఈవో కూడా తనే.
అంకుర సంస్థ అంటే అంత సులువైన వ్యవహారం కాదు. ఆలోచన ఉండాలి. తగిన బృందం కావాలి. పెట్టుబడి సమకూర్చుకోవాలి. నిపుణుల సలహాలూ అవసరమే. ఈ కొరతను తీర్చే దిశగా ఆవిర్భవించింది.. స్కోప్ యాప్. ఈ స్టార్టప్ వ్యవస్థాపకుడి పేరు అప్పల్ల సాయికిరణ్. వయసు ఇరవై. స్కోప్ యాప్.. ఔత్సాహిక ఆంత్రప్రెన్యూర్లు, స్టార్టప్లను ఇన్వెస్టర్లు, బిజినెస్ మెంటర్లు, ఆయా రంగాల నిపుణులతో అనుసంధానం చేస్తుంది. సాయికిరణ్ బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి. డేటా సైన్స్ తన అభిమాన విషయం. మూడేండ్ల క్రితమే.. పదిహేడేండ్ల వయసులోనే స్కోప్ యాప్ను స్థాపించాడు. ఇప్పటికే స్కోప్లో 60 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. భారత్, అమెరికా, యూరప్, సింగపూర్, దుబాయి నుంచి 20 వేలమంది ఏంజెల్ ఇన్వెస్టర్లు, విశ్వ కుబేరులు, ఏడు వేల వెంచర్ క్యాపిటల్ సంస్థలతో స్కోప్ యాప్ ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది. గూగుల్ సహ-వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్కు చెందిన బేషోర్ గ్లోబల్ లాంటి దాదాపు 200 సంస్థలు ఆ జాబితాలో ఉన్నాయి. స్టార్టప్లకు అవసరమైన నిధులు సమకూరడానికి కనీసం 6 నెలలు పడుతుంది. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ సమయమే తీసుకోవచ్చు. ఆ ఆలస్యాన్ని నివారించడానికి సాయికిరణ్ ఓ పరిష్కారం వెతికాడు. “నిధుల సేకరణలో జాప్యాన్ని తగ్గించాలి అనుకున్నాను. ఏ స్టార్టప్ అయినా, ఫండింగ్కు సుమారు ఆరు నెలల సమయం పడుతుంది. ఇన్వెస్టర్లతో పద్దెనిమిది నుంచి ఇరవై సమావేశాలు అవసరం అవుతాయి. దాన్ని మేం మూడు నుంచి నాలుగు నెలలకు తగ్గించగలిగాం. పది సమావేశాలలో పని పూర్తి చేయాలని తీర్మానించాం” అని చెబుతాడు సాయికిరణ్. ఈ కుర్రాడి ఆంత్రప్రెన్యూర్షిప్ ప్రయాణానికి స్ఫూర్తి.. టెస్లా, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్.
“ఆంత్రప్రెన్యూర్స్ మీద శ్రీమంతులు కానుకల పన్నీరు చిలకరించడం కంటే.. పెట్టుబడి వర్షం కురిపించడమే మేలు” అనే మస్క్ మాట సాయికిరణ్కు స్ఫూర్తినిచ్చింది. అలా స్టార్టప్లకు నిధుల సమీకరణ సుగమం చేసే బాధ్యత తీసుకున్నాడు సాయికిరణ్. స్టార్టప్వాతావరణంలో ఆంత్రప్రెన్యూర్లకు కావాల్సిన అన్ని రకాల ప్రోత్సాహాలకు ఒకే ఒక్క పరిష్కారంగా స్కోప్ యాప్ను స్థాపించాడు. అదే ఇప్పుడు ఎందరికో అవకాశాల దారి చూపుతున్నది.
మొదలైంది ఇలా..
స్కోప్ యాప్ స్థాపన కోసం సాయికిరణ్ తనకుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి 10 లక్షల రూపాయలు సేకరించాడు. తొలి దశలో చిన్నాచితకా కష్టాలు ఉన్నా.. ఇప్పుడు మాత్రం కాసులు పండుతున్నాయి. అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్ టిప్ డ్రేపర్ 12 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టారు. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 3 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టింది. సాయికిరణ్ విద్యాభ్యాసం హైదరాబాద్లోని మెరీడియన్ స్కూల్లో సాగింది. ఉన్నత పాఠశాల విద్య రాజస్థాన్ పిలానీలోని బిర్లా స్కూల్లో జరిగింది. ఇక్కడ ఆంత్రప్రెన్యూర్గా ఎదురైన పరాజయమే స్కోప్ యాప్ స్థాపనకు పునాది వేసింది. సాయికిరణ్ 11వ తరగతిలో ఉన్నప్పుడు విద్యార్థులకు సరైన స్టడీ గ్రూప్స్, సహచరులను కలపడానికి ప్లేస్టోర్లో ఓ యాప్ కోసం దాదాపు 20 వేల రూపాయలు వెచ్చించాడు. మొదటి మూడు గంటల్లోనే 15,000కు పైగా డోన్లోడ్లు జరిగాయి. ఐదు రోజుల్లో ఈ సంఖ్య 30,000కు చేరుకుంది. ఆ తర్వాత సర్వర్ ఆ భారాన్ని మోయలేకపోయింది. మరింత స్పేస్ అవసరమైంది. దాన్ని సమకూర్చుకునే వనరులు సాయికిరణ్ దగ్గర లేవు. దాంతో ఏంజెల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టుల ఆర్థిక సాయం కోసం మెయిల్స్ పెట్టినా స్పందన కరువైంది. అలా కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికోసం ఏదైనా చేయాలనే ఆలోచన మొదలైంది. పైగా స్టార్టప్ వాతావరణంలో కాలమే డబ్బు. రోజులు గడిచే కొద్దీ ఆలోచన పాతబడిపోతుంది. ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడుల విషయంలో ఓపట్టాన అవుననీ కాదనీ చెప్పరు. ఈ గందరగోళాన్ని నివారించాలని సాయి నిర్ణయించుకున్నాడు. అలా మొదలైందే స్కోప్ యాప్. ఇక స్టార్టప్ ప్రయాణంలో సాయికిరణ్కు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు దక్కాయి. మహామహా వ్యాపారవేత్తలతో భుజాలు కలిపి తిరిగే అవకాశం దొరికింది. “నేను స్టార్టప్ ప్రపంచంలో అత్యున్నత ప్రమాణమైన వై-కాంబినేటర్ను సృష్టించాలనుకున్నాను. దేశంలో ఉన్న ప్రతిభావంతులకు తగినంత అండ, సరైన గుర్తింపు దొరకాలి. తగినన్ని వనరులు అందుబాటులో ఉండాలి” అంటాడు సాయికిరణ్.
Vishwa Bharath | ఒకప్పుడు ఊబకాయంతో బాధపడ్డాడు.. ఇప్పుడు సెలబ్రెటీలకే ఫిట్నెస్ ట్రైనర్ అయ్యాడు!!”