Harish Rao | కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో చోద్యం చూడటం మానేసి, వెంటనే రాష్ట్ర వ్యాట్ తగ్గించి, ప్రజలకు ఉపశమనం కలిగించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాశారు.
‘పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజల నడ్డి విరుస్తున్నాయి, రాష్ట్ర పన్నులు తగ్గించాలి’అని నాడు పీసీసీ హోదాలో ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి, నేడు అధికారంలో ఉండి ఎందుకు వ్యాట్ తగ్గించడం లేదని లేదని నిలదీశారు. ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాటలు దంచుడు కాదు.. దమ్ముంటే మాట మీద నిలబడి పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలు దించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.వారంలో నాలుగు సార్లు ఫ్యూయల్ ధరలు పెంచి కేంద్రం ప్రజలపై పెను భారం మోపితే, మరోవైపు రేవంత్ రెడ్డి రాష్ట్ర పన్నులు తగ్గించకుండా ప్రజల నడ్డి విరిస్తున్నారని మండిపడ్డారు.
సామాన్యుడు బైక్ తీయాలన్నా పెట్రోల్ భారం..
పెరిగిన సాగు ఖర్చులు భరించలేక రైతులు సతమతమవుతుంటే, మరో వైపు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు రైతుల పరిస్థితి తయారైందన్నారు.రవాణా రంగం తీవ్ర సంక్షోభానికి లోను కావడంతో ద్రవ్యోల్బణం పెరిగి అన్ని వర్గాల ప్రజల జీవనంపై ప్రతికూల ప్రభావం పడుతున్నదన్నారు.పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, పన్నుల భారం వల్ల ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు పొలం దున్నాలన్నా డీజిల్ భారం..సామాన్యుడు బైక్ తీయాలన్నా పెట్రోల్ భారం…ఆటో సోదరుడి బతుకు బండి నడవాలన్నా ఇంధన భారం.. పెరిగిన ధరలు ప్రజానీకానికి పెను శాపంగా మారిందన్నారు హరీశ్ రావు.పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన ప్రతిసారీ రేవంతు ప్రభుత్వం వ్యాట్ రూపంలో ఖజానా నింపుకుంటూ సంబుర పడుతుందని, పైశాచిక ఆనందం పొందుతుందన్నారు.
ప్రజల సంక్షేమాన్ని విడిచి పెట్టి ప్రచారాలకే పెద్ద పీట..
పెరిగిన ధరలతో ప్రతి నెలా రూ.162 కోట్లు, ఏడాదికి దాదాపు 2,000 కోట్ల అదనపు వ్యాట్ ఆదాయం వస్తుంటే.. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విడిచి పెట్టి ప్రచారాలకే పెద్ద పీట వేస్తున్నది విమర్శించారు. ఎన్నికల ముందు వ్యాట్ పై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి, రెండున్నరేళ్లుగా కేనీసం 0.1% వ్యాట్ కూడా తగ్గించకపోవడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరు, అధికారంలోకి వచ్చాక మరొక తీరు వ్యవహరిస్తూ కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. నిజంగా ప్రజా పాలనే అయితే, వెంటనే పెట్రోల్, డీజిల్పై కనీసం 10% వ్యాట్ తగ్గించి, పెరిగిన ఇంధన ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ పెంపుపై మొసలి కన్నీరు కార్చే రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ వ్యాట్ దోపిడీపై స్పందించాలని, వ్యాట్ తగ్గించేలా రేవంత్ రెడ్డిని ఆదేశించాలని కోరారు.