Petro prices : దేశంలో పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలు ఇప్పటికే నాలుగుసార్లు పెరిగాయి. ఒక లీటరుపై దాదాపు రూ.7.38 వరకు భారం పడింది. ఈ పెంపు ఇంతటితో ఆగదని సమాచారం. చమురు సంస్థల (Oil companies) నష్టాల నేపథ్యంలో ధరలు మరింత పెంచక తప్పదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇండియన్ ఆయిల్ (Indian Oil), భారత్ పెట్రోలియం (Bharat petrolium), హిందుస్థాన్ పెట్రోలియం (Hindustan Petrolium) లాంటి ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలు తాజా పెంపుతో పూర్తిగా భర్తీ కాలేదు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు, మన రిటైల్ ధరలకు ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేయాలంటే లీటరుపై మరో రూ.20 నుంచి రూ.33 వరకు పెంచాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఒక్కసారిగా అంత భారం మోపడం సాధ్యం కాకపోయినా.. విడతల వారీగా ధరల బాదుడు తప్పదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు పాల్పడటంతో ఫిబ్రవరి 28 నుంచి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. కానీ మనదేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా వరుసగా 74 రోజులపాటు ఇంధన ధరలను పెంచకుండా నిలిపివేశారు. భారత్ తన అవసరాల కోసం 88 శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటుంది. కానీ ధరలను స్థిరంగా ఉంచడంవల్ల మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలపై ఏకంగా రూ.1.2 లక్షల కోట్లకుపైగా భారం పడింది.
ఇప్పుడు ఆ మూడు ఆయిల్ కంపెనీల నష్టాలను పూడ్చేందుకు ధరల పెంపుపై దృష్టిసారించారు. ఇప్పటికే గత పది రోజుల్లో నాలుగుసార్లు పెట్రోల్ ధరలను పెంచారు. అయితే ఇరాన్, అమెరికా మధ్య చర్చలు సఫలమైతే మన చమురు సంస్థలకు ఊరట కలుగుతుంది. అయినా రవాణా ఖర్చులు, పాత నష్టాలవల్ల ధరల భారం వెంటనే తగ్గే అవకాశం లేదు. ఇటు ప్రజలపై ద్రవ్యోల్బణ భారం పడకుండా అటు చమురు సంస్థలు నష్టపోకుండా చూడటం ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.