వికారాబాద్, మే 20, (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి ప్రభుత్వం జ్వర సర్వే చేపట్టింది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే మొదటి, రెండో విడుత సర్వే పూర్తి చేసిన అధికారులు మూడో విడుతను గురువారం ప్రారంభించారు. పట్టణ శివారు కాలనీలు, సరిహద్దు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉండగా, 566 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపుగా 1.80 లక్షల ఇండ్లను సర్వే చేసి దాదాపుగా 6వేల మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 1093 మంది స్వల్ప లక్షణాలతో ఉన్నట్లు గుర్తించగా.. 1095 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ జిల్లా వైద్యారోగ్య శాఖ కొవిడ్ కిట్లు అందించి హోం ఐసొలేషన్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వీరందరూ 14 రోజులకు పైగా హోం ఐసొలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. కాగా, జిల్లాలో ఏ ఏ ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య ఎక్కడ ఎక్కువగా ఉన్నాయని జిల్లా యంత్రాంగం ఆరా తీశారు. ఐదు రోజుల కంటే ఎక్కువ రోజులు లక్షణాలు ఉన్నవారిని ప్రత్యేకంగా గుర్తించారు. ఆ జాబితా ప్రకారం మరోసారి ఇటీవల రెండో విడుత సర్వే పూర్తి చేశారు. మూడో విడుతలో జిల్లాలో ఇంకా కొవిడ్ లక్షణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు శ్రీకారం చుట్టారు.
8 మండలాల్లోనే అధికంగా కేసులు..
జిల్లాలోని 18 మండలాలుండగా..8 మండలాల్లోనే అధికంగా కరోనా కేసులు నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఈ మండలాల్లోనే మూడో విడుత సర్వే చేపడుతున్నారు. పరిగి, పూడూరు, కులకచర్ల, దోమ, కొడంగల్, దౌల్తాబాద్, మోమిన్పేట, బషీరాబాద్ తదితర మండలాల పరిధిలోని 250 నుంచి 260 గ్రామ పంచాయతీల పరిధిలో సర్వే చేస్తున్నారు. గ్రామకార్యదర్శి, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు మాత్రమే ఈసర్వే సాగిస్తున్నారు. ప్రతి ఇంటికెళ్లి జ్వరం ఉందా.. బీపీ, షుగర్ ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నాయా.. అని ఆరా తీసి రికార్డు చేసుకుంటున్నారు. ఈ వివరాలన్ని జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారులకు నివేదిస్తారు. ఆ రిపోర్టు ఆధారంగా లక్షణాలున్నవారికి ర్యాపిడ్ టెస్టులు చేస్తారు. టెస్టు సెంటర్ల వద్ద క్యూలో ఉండకుండా ముందుగా వీరికే పరీక్షలు చేస్తారు.