అచ్చంపేట రూరల్, జూలై 12: మున్సిపాలిటీలో ఆయా వార్డుల్లో అధికమైన పందులతో ప్రమాదం పొంచి ఉన్నది. పట్టణం నుంచి సమీపంలోని ఆయా గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు ద్విచక్రవాహనాలపై వెళ్లాలంటే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలో పందులను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గతేడాది మొదటి విడుత పట్టణ ప్రగతిలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, అదనపు కలెక్టర్ మనూచౌధరి సూచించినప్పటికీ అరికట్టడంలో మున్సిపాలిటీ అధికారులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. దీంతో కాలనీల్లో పందుల బెడద ఎక్కువయ్యాయి. పట్టణం నుంచి కొండనాగుల, బల్మూర్, లింగాల వైపు వెళ్తుండగా ఇంద్రనగర్, మహేంద్రనగర్ కాలనీల్లో పందులు తగిలి అనేకమంది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. ఉప్పునుంతల రోడ్డు లింగోటం సమీపంలో ఇటీవల పంది తగిలి శ్రీను తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.
అదేవిధంగా రెండు రోజుల కిందట అనూష పెట్రోల్ పంపు సమీపంలో పంది తగలడంతో రాజారెడ్డి అనే వ్యక్తి ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో హైదరాబాద్ లోని ఓ దవాఖాన నాలో చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నా పట్టించుకోవాల్సిన అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పట్టణ ప్రజలను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ అనేక మంది ప్రాణాలను తీసిన నేపథ్యంలో నేటి వర్షాకాలం మరింత భయాందోళనలకు గురి చేస్తున్నది. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో కాలనీల్లో పెరుగుతున్న పందులతో అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉందని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పట్టణంలో రెండో విడుత పట్టణ ప్రగతి పనులు పూర్తయినప్పటికీ పందులను నివారించడం గాలికొదిలేశారు. ఇప్పటికైనా మధురానగర్, మహేంద్రనగర్, మారుతీనగర్, చింతల్బస్తీ మొదలైన కాలనీల్లో పందులను తరలించి సీజనల్ వ్యాధుల నుంచి పట్టణ ప్రజలను కాపాడాలని ఆయా కాలనీల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
15 వరకు అవకాశం ఇస్తున్నాం
పందుల వ్యాపారులు పందులను ఇతర ప్రాంతాలకు తరలించాలని ఇది వరకే రెండు సార్లు అవకాశం ఇచ్చాం. మూడోసారిగా నిర్వాహకులు సహకరించి ఈనెల 15వరకు తీసుకెళ్లాలి. లేకుంటే 16న పోలీసు బందోబస్తు మధ్య పందులను తరలించేందుకు సిద్ధంగా ఉన్నాం. విషయం పందుల వ్యాపారులకు పదేపదే చెబుతున్నాం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.