సిద్దిపేట, జూన్ 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రజలు చైతన్యవంతులు.. మేడిపల్లి సత్యనారాయణరెడ్డి, రంగధాంపల్లి నాగిరెడ్డి మేమంతా కలిసి అప్పుడు నాకొకటి చిన్న మారుతి కారు ఉండే.. నేనే స్వయంగా నడుపుకుంటూ 46 గ్రామాలు తిరిగిన. అక్కడ రైతులను సమీకరించి మాట్లాడడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతే సచ్చిపోతం.. ఇండ్లల్లో ఉన్న హీటర్లను పగులగొడుదామని ఒక ఉద్యమం చేపట్టినం.
సిద్దిపేట నియోజకవర్గంలో అప్పుడు నేను హీటర్లను పగులగొడుతానంటే నవ్విన్రు కొంతమంది.. ఆ సమయంలో అందరం లీడర్లం బదులుకొని ఒకటే రోజు 6400 హీటర్లను పగులగొట్టింది సిద్దిపేట గడ్డ. అంత చైతన్యం ఉంది ఇక్కడ.. ఆ తెలివి తేటలు సిద్దిపేట ప్రజలకు ఉన్నాయి..ఏదైనా కార్యక్రమాన్ని ఇస్తే స్వీకరిస్తారు.. స్మితా సబర్వాల్ మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు చాలాసార్లు నాతో చెప్పింది. మెదక్ జిల్లా అంతా తిరిగితే ఒక రకంగా ఉంటుండే.. సిద్దిపేటకు వస్తే ఒక రకంగా ఉంటుండే.. అని చెబుతుండే.. అప్పుడున్న కలెక్టర్లు సిద్దిపేటకు వస్తే ఎంజాయ్ చేసి పోతుండే.. అన్ని అభివృద్ధి పనులు ప్రోగ్రెస్లో ఉంటాయి.. పేరుకు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, అంత సర్పంచులు వారి ఊళ్లలో గిది గిట్ల..గిది గిట్ల అని రాసుకొని వస్తే సంతకం పెట్టేటోన్ని.. అంత ఐక్యతతోని ఉంటారు. ఇప్పుడు కూడా అట్లనే ఉన్నరు.. మీ నాయకుడు హరీశ్ మంచిగున్నడు.. కాబట్టి పనులు బాగా జరుగుతున్నయి. అద్భుతంగా జరుగుతున్నయి… ఇది వాస్తవం..” అని సిద్దిపేట నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ అన్నమాటలివి.