Children health | ప్రకృతిలోని జీవులన్నిటికీ నీరు అత్యవసరం. మొక్కకు సరిపడా నీళ్లు అందకపోతే, ఎండిపోయి మరణిస్తుంది. అదేవిధంగా పిల్లల విషయంలోనూ నీరు సరైన మోతాదులో అందకపోతే, అతిసారవ్యాధి బారిన పడే అవకాశం ఉంది. అతిసారవ్యాధిని వెంటనే గుర్తించి సరైన చికిత్స అందించకపోతే చిన్నారుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. వ్యాధి ప్రథమ దశలో విరేచనాలు అవుతుంటాయి. పిల్లలు చిరాకుతో ఏడుస్తుంటారు. దాహం విపరీతంగా పెరుగుతుంది. వ్యాధి తీవ్రమవుతున్న కొద్దీ ఇతర లక్షణాలు బయటపడతాయి.
శరీరంలో నీరు, వివిధ ఖనిజ లవణాల పరిమాణం తగ్గడం వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. వ్యాధి తీవ్ర దశలో మాడు లోపలికి వెళ్లి, స్పందన తగ్గుతుంది. ఏడ్చినప్పుడు కన్నీరు రావడం తగ్గి, కండ్లు ఎండిపోయి లోనికి పీక్కొని పోతాయి. నాలుక లోపలి భాగంలో తడి ఆరిపోతుంది. శరీరంలో బై-కార్బొనేట్ అనే పదార్థం తగ్గడం వల్ల శ్వాసక్రియ, గుండె వేగం పెరుగుతుంది. చర్మం ముడతలు పడుతుంది. కడుపు మీద చర్మాన్ని రెండు వేళ్ల మధ్య పట్టుకొని నొక్కితే ముడతపడి, వేళ్లు విడిచిన తర్వాత కూడా ఆ ముడత కొంతసేపు అలాగే ఉంటుంది. వ్యాధిలేని వారిలో మాత్రం చర్మం వెంటనే యథాస్థితికి వస్తుంది.
విరేచనాల కారణంగా శరీరంలోని పొటాషియం బయటికి పోవడం వల్ల పేగు పనిచేయక కడువు ఉబ్బుతుంది. హృదయ స్పందన గతిలో మార్పు వస్తుంది. జలహీనత పెరుగుతున్న కొద్దీ రక్తపరిమాణం తగ్గి, నాడి బలహీనమై రక్తపోటు పడి పోతుంది. కాళ్లు, చేతులు చల్లబడి చెమట పడుతుంది. దీన్నే ‘షాక్’ అంటారు. రక్త పరిమాణం తగ్గడం వల్ల మూత్రం క్రమంగా తగ్గి మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోవచ్చు. శరీరంలో నీరు తగ్గడంతో రక్తం చిక్కపడి, మెదడు సిరలలో రక్తం గడ్డకట్టి ఫిట్స్ రావచ్చు. రక్తంలో క్యాల్షియం తగ్గడం, సోడియంలో హెచ్చుతగ్గుల వల్ల కూడా ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెంటనే చికిత్స అందించకపోతే పిల్లల ప్రాణానికే ముప్పు.
– డాక్టర్ కర్రా రమేశ్రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు
మీ పిల్లలను ఎలా పెంచుతున్నారు? వాళ్లకు ఏం నేర్పిస్తున్నారు?”
“ఒమిక్రాన్ వట్టిదే అనుకుంటే పొరపాటే.. పిల్లలపై ఇది ఏ రేంజ్లో ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసా !!”
మీ పిల్లలు ఫోన్లకు అతుక్కుపోతున్నారా? ఆ అలవాటు ఇలా మాన్పించండి”