మోర్తాడ్, ఆగస్టు 2: కాళేశ్వరం జలాలు నిజామాబాద్ జిల్లాను మరోమారు ముద్దాడాయి. ఆదివారం ఉదయం 7 గంటలకు జిల్లా సరిహద్దులోని కమ్మర్పల్లి మండలం నాగాపూర్ శివారులోని క్రాస్రెగ్యులేటర్ గేట్లను అధికారులు ఎత్తడంతో కాళేశ్వరం జలాలు జిల్లాలోకి అడుగుపెట్టాయి. వరదకాలువ 73వ కిలోమీటర్ వద్ద రాంపూర్ పంప్హౌస్ వద్ద నాలుగు మోటర్లను ఆన్చేసి నాలుగు పంపుల ద్వారా వరదకాలువలోని నీటిని విడుదల చేయడంతో 34 కిలోమీటర్ల దూరంలోని రాజేశ్వర్రావుపేట్ పంప్హౌస్కు కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. వరద కాలువకు కాళేశ్వరం జలాలను ఎత్తిపోయడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమైంది. ఇక తమ పంటలకు ఢోకా లేదన్న ధీమాను వ్యక్తంచేస్తున్నారు. కాగా కమ్మర్పల్లి-మోర్తాడ్ సరిహద్దులోని తిమ్మాపూర్ బైపాస్రోడ్డు సమీపంలో వరద కాలువ బ్రిడ్జి వద్ద రివర్స్పంపింగ్ ద్వారా నీరు ఎదురెక్కి పారుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వరదకాలువలో ఎదురెక్కి వస్తున్న కాళేశ్వరం జలాలపై బీఆర్ఎస్ నాయకులు, రైతులు పూలు చల్లిస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమ్మర్పల్లి శివారులో వరదకాలువపై కేసీఆర్, వేముల ప్రశాంత్రెడ్డి చిత్రపటాలకు కమ్మర్పల్లి, మోర్తాడ్, వేల్పూర్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, రైతులు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.