హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): హరికథాగానం, శ్రీరామలీల వంటి రచనలు చేసిన, తన రామాయణ గానంతో తెలుగు ప్రజలను ఉర్రూతలూగించి గేయవాల్మీకిగా పేరొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి రుక్మాభట్ల నరసింహస్వామి అని పలువురు వక్తలు కొనియాడారు. తెలంగాణ విద్వత్సభ దశాబ్ది వేడుకల్లో భాగంగా రెండవరోజైన ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రుక్మాభట్ల నరసింహస్వామికి తెలంగాణ విద్వత్సభ జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. డాక్టర్ శంకరమంచి రామకృష్ణశాస్త్రి ఆధ్వర్యంలో పలువురు సిద్ధాంతులు, వేదపండితులు సూర్యసిద్ధాంత పారాయణం చేశారు. పంచాంగ నిర్మాణంలో భాగంగా శాస్త్రగ్రంథాలు, దృగ్గణితం, దేశకాల పరిస్థితులు, సంప్రదాయ ప్రమాణాలను సమన్వయం చేసుకుంటూ పండుగలు, వ్రతాలు, ఉత్సవాల తేదీల విషయంలో ప్రజలకు సందేహాలు కలుగకుండా పంచాంగకర్తలు శాస్త్ర ప్రమాణాలను అనుసరించాలని వక్తలు సూచించారు. మొదట జ్యోతిష సదస్సు, ఆ తర్వాత ధర్మశాస్త్ర సదస్సు నిర్వహించారు. సాయంత్రం జరిగిన వేడుకలకు సీఎం ప్రజావాణి నోడల్ అధికారి విద్యాసాగర్, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్తు చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, ప్రభుత్వ మాజీ సలహాదారు వేణుగోపాలాచారి పాల్గొని పలురంగాల్లో ప్రముఖులకు విశిష్ట ప్రతిభా పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా ప్లవంగ నామ సంవత్సరం పండుగల జాబితాను వేదికపై ప్రకటించారు. కార్యక్రమంలో విద్వత్సభ అధ్యక్షుడు యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి, కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి, కోశాధికారి మరుమాముల వెంకటరమణశర్మ, తూండ్ల కమలాకరశర్మ, శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు.