ఖమ్మం కమాన్బజార్, ఆగస్టు 2: జాబ్ క్యాలెండర్ పేరుతో హామీ ఇచ్చి రాష్ట్రంలోని నిరుద్యోగులు, ఉద్యోగార్థులను కాంగ్రెస్ నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. ఉద్యోగాల పేరుతో వంచించడం, హామీలను ఎగవేయడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆందోళన వ్యక్తంచేశారు. జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోవడంతో మనస్తాపం చెందిన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురానికి చెందిన గడ్డం వేణుకుమార్ శనివారం ఆత్మహత్యకు యత్నించిన విషయం విదితమే. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న అతడిని మాజీ మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ తాతా మధు, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు తదితరులు ఆదివారం పరామర్శించారు. అధైర్య పడవద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని బాధితుడికి ధైర్యం చెప్పారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగుల ఆశలను కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ముచేయడం దారుణమని పువ్వాడ అజయ్ విమర్శించారు. నిరుద్యోగుల సమస్యల పరిషారం కోసం బీఆర్ఎస్ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలతోపాటు నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయడం వల్లనే గ్రూప్స్ ఉద్యోగార్థి వేణుకుమార్ ఆత్మహత్యాయత్నం చేశాడని ఎమ్మెల్సీ తాతా మధు, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, జడ్జీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. సూసైడ్ నోట్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు చేరేలా సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరడం ప్రజలందరినీ కలచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. అతడి తల్లి మానసిక దివ్యాంగురాలని, తండ్రి గీత కార్మికుడని, సొంత ఇల్లు కూడా లేదని, పదేండ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నారని పేర్కొన్నారు. అతడి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోవడానికి కొలమానం ఏమిటో చెప్పాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని ప్రశ్నించారు. వేణు ఆవేదన మీడియా, ప్రజల దృష్టికి వెళ్లకుండా ప్రభుత్వం పోలీసు బ ందోబస్తుతో అడ్డుకుంటున్నదని ఆరోపించారు.