న్యూఢిల్లీ : ఎముకలు శరీర నిర్మాణానికి ఊతమిస్తూ కీలక అవయవాలను కాపాడుతూ ఆరోగ్యం, శరీర వృద్ధికి అవసరమైన క్యాల్షియంను స్టోర్ చేస్తాయి. ఎముకల బలానికి మెరుగైన ఆహారం, ఆరోగ్యకర జీవనశైలిని అలవరుచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడుతుంటాయి. యుక్త వయస్సులో కొత్త ఎముకలను శరీరం వేగంగా తయారుచేసుకుంటూ బోన్ మాస్ను పెంచుతుంది. 30 ఏండ్ల వరకూ ఎముకలు, జాయింట్స్ శరీర బరువును భరించేంత గట్టిగా ఉంటాయి.
30 ఏండ్లు పైబడిన కొద్దే ఎముకలు, కీళ్లు బలహీనపడటం మొదలై అర్ధరైటిస్, ఆస్టియోపోరోసిస్ బారినపడే ముప్పును పెంచుతాయి. ఎముకల సంబంధిత వ్యాధులకు ప్రత్యేక చికిత్స లేకున్నా వీటి బారినపడకుండా, నియంత్రణలో ఉంచుకునేందుకు ఎముకల సమస్యలను జాప్యం చేసేందుకు సహజమైన పద్ధతులతో పాటు కొన్ని మందులను వాడవచ్చు. ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ కంటే నేచురల్ సప్లిమెంట్స్ను వాడటం మేలని నిపుణులు చెబుతున్నారు. ఎముకల సాంద్రత కోసం క్యాల్షియంను మెరుగ్గా గ్రహించేందుకు విటమిన్ డీ ఎంతో అవసరం. విటమిన్ డీ ఎముకల క్షీణతను అరికట్టి ఫ్రాక్చర్ ముప్పును తగ్గిస్తుంది.
ముఖ్యంగా వయసుపైబడిన పురుషులు, మహిళల్లో ఎముకల సమస్య నివారించేందుకు తగినంత విటమిన్ డీ అవసరం. క్యాల్షియంతో పాటు విటమిన్ డీ ఆస్టియోపోరోసిస్ నివారణ, చికిత్సలో సహకరిస్తుంది. విటమిన్ డీ పాలు, గుడ్లు, వెన్న, బ్రేక్ఫాస్ట్ సిరిల్స్, ఆరంజ్ జ్యూస్, పెరుగు వంటి ఆహార పదార్ధాల్లో లభిస్తుంది. ఇక క్యాల్షియం కూడా ఎముకలు పటిష్టంగా ఉండేందుకు అవసరమని నిపుణులు చెబుతున్నారు. క్యాల్షియం డైరీ ఉత్పత్తులు, ఆకుకూరలు, చేపల్లో అధికంగా ఉంటుంది. ఎముకలు పటుత్వానికి కీలకమైన ఫాస్పరస్ పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు, నట్స్లో ఎక్కువగా లభిస్తుంది.
Read More :