Tapeworms | చిన్నారులు మట్టిలో ఆడి, చేతులు కడగకుండా భోజనం చేసినప్పుడు అందులో ఉండే రకరకాల నులిపురుగుల లార్వాలు నోటి ద్వారా కడుపులోకి ప్రవేశిస్తాయి. పేగుల్లో పూర్తిస్థాయి నులిపురుగులుగా అభివృద్ధి చెంది, అక్కడే తిష్ఠవేస్తాయి. 1-19 ఏళ్లలోపు చిన్నారులు, బాలబాలికల ఆరోగ్యంపై ఈ నులిపురుగులు తీవ్ర ప్రభావం చూపుతాయి. వీరు తినే ఆహారం పేగుల్లోకి చేరినప్పుడు రక్తంలోకి చేరాల్సిన పోషకాలను నులిపురుగులే పీల్చుకోవడంతో చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోయి వివిధ రోగాలబారిన పడుతారు. పిల్లల్లో ఎదుగుదల లేకపోవడాన్ని గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయమై అధ్యయనం చేసింది. నులిపురుగుల నివారణకు ప్రపంచ దేశాలకు పిలుపు నిచ్చింది. కేంద్రం వీటి నివారణకు 1-19 ఏళ్ల లోపు వారికి ఏటా రెండు పర్యాయాలు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తోంది.
పిల్లల పేగుల్లో సాధారణంగా మూడు రకాల పురుగులు తిష్ఠవేస్తాయి. వీటిలో ఏలిక పాములు(ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్), కొంకి పురుగులు(అంకైలోస్టోమాడియోడెనేల్), చుట్ట పాములు (టీనియా సోలియం) అనే మూడురకాలుంటాయి. ఈ నులిపురుగులు 55 ఫీట్ల(17 మీటర్ల)దాకా పెరిగి 25 ఏళ్ల దాకా బతుకుతాయి. వీటి గుడ్లు మట్టిలో 10 ఏళ్లకు పైగా దెబ్బతినకుండా ఉంటాయి. సరిగ్గా ఉడికించని పంది, గొడ్డు మాంసం ద్వారా చుట్టపాములు కడుపులోకి చేరుతాయి. మట్టిలో ఆడితే పాదాల ద్వారా కొంకి పురుగుల లార్వాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి.
నులి పురుగుల వల్ల పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా రక్తహీనత, పోషకాహార లోపం బారిన పడతారు. ఆకలి లేకపోవడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, అతిసారం, మలంలో రక్తం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడంలాంటి లక్షణాలు కనిపిస్తాయి. నులి పురుగులు సంక్రమించిన చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోతుంది. నులి పురుగులు ఉన్న బాలబాలికలు ఆరుబయట మలవిసర్జన చేస్తే, అవి ఇతరుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. మల పరీక్ష ద్వారా నులి పురుగులను గుర్తించవచ్చు. నులి పురుగుల లార్వాలు 20 లోపు ఉంటే మామూలు, 20 నుంచి 40 దాకా ఉంటే మధ్యస్తంగా, 40కిపైగా ఉంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు భావిస్తారు.
➤ బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం మానుకోవాలి.
➤ ఆహారంపై ఈగలు, దోమలు, కీటకాలు వాలకుండా చూడాలి.
➤ పండ్లు, కూరగాయాలను శుభ్రమైన నీటితో కడిగి వండుకోవాలి.
➤ స్వచ్ఛమైన నీటినే తాగాలి.
➤ చేతి గోర్లను చిన్నగా కత్తిరించుకొని శుభ్రంగా ఉంచుకోవాలి.
➤ మలవిసర్జన తర్వాత, భోజనానికి ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
➤ కాళ్లకు చెప్పులు, బూట్లు ఉంటేనే బయటికి వెళ్లాలి.
➤ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
తేనె, వెల్లుల్లి, గుమ్మడికాయ విత్తనాలు, దానిమ్మ పండ్లు, క్యారెట్ వంటి ఆహారం కడుపులోని పురుగులను తగ్గించడంలో తోడ్పడుతుంది. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. కడుపులో బద్దె పురుగులు, ఏలికపాము వంటివి పుదీనా రసం పరకడుపున తీసుకోవడం ద్వారా మలము ద్వారా అవి బయటపడిపోతాయి. ఆహారం జీర్ణమవ్వడంలో తోడ్పడే ఎంజైమ్ల వల్ల చిన్న పేగు ఆరోగ్యంగా ఉంటుంది. ఎంజైమ్లు వృద్ది చెందాలంటే విటమిన్-సీ, జింక్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. కలుషితమైన నీళ్లను తాగకూడదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Spondylitis | సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఎక్కువగా వేధిస్తున్న ఈ సమస్యను ఎలా జయించాలి?
Climate Change : పిల్లలు జాగ్రత్త.. ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు..
తల్లిదండ్రులకు హెచ్చరిక.. డిజిటల్ మాధ్యమాలు ఎక్కువగా వాడే పిల్లల్లో ఊబకాయం ముప్పు
ఆన్లైన్ క్లాసులతో పిల్లలకు కొత్త తంటా.. పెరుగుతున్న మెల్లకన్ను సమస్యలు