కోల్కతా : కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కొవిడ్-19 బారినపడ్డారు. జులై తొలివారంలో ఇన్ఫెక్షన్ సోకిన వీరు దవాఖానలో చేరగా ఆపై వారిని ఐసీయూకు తరలించాల్సిన పరిస్ధితి నెలకొంది. ఇది అరుదుగా కనిపించే బ్రేక్థ్రూ ఇన్ఫెక్షన్కు ఉదాహరణని వైద్యులు తెలిపారు. టీకా తీసుకున్నా ఇలాంటి ఘటనలు వెలుగుచూడటం అంటే కరోనాపై పోరాటంలో వ్యాక్సిన్లు పనిచేయవని అర్ధం కాదని వారు స్పష్టం చేశారు. తన తండ్రికి జులై 7న జ్వరం రాగా పరీక్షలో కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఆపై న్యుమోనియా ఉన్నట్టు బయటపడిందని నగరంలోని సాల్ట్లేక్ ప్రాంతానికి చెందిన సురజిత్ మాఝీ (43) చెప్పారు.
తాను ఎన్నికల విధులకు హాజరయ్యానని మార్చిలోనే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోగా, ఏప్రిల్ నాటికి తల్లితండ్రులిద్దరూ వ్యాక్సిన్ పూర్తి డోసు తీసుకున్నారని తెలిపారు. తాము ముగ్గురం కొవిషీల్డ్ టీకాలు వేయించుకున్నామని వెల్లడించారు. ఇన్ఫెక్షన్ సోకగానే ఇంటివద్దే తండ్రికి చికిత్స ప్రారంభించామని ఆయనకు పలు వ్యాధులు ఉండటంతో 13న దవాఖానలో చేర్పించామని తెలిపారు. అదేరోజు తన తల్లి (65)తో పాటు తనకూ కొవిడ్-19 పాజిటివ్గా రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. అప్పటినుంచి తాము ఇంట్లోనే చికిత్స పొందామని 17న తల్లికి శ్వాస సమస్యలు ఎదురవడంతో ఆమెనూ దవాఖానలో చేర్పించామని అన్నారు.
మరుసటి రోజు ఆమెను ఐసీయూకు తరలించారని, ఇక కరోనా నుంచి కోలుకోవడంతో 18న తన తండ్రిని డిశ్చార్జి చేశారని చెప్పారు. ఇక ఐదురోజుల పాటు హోం క్వారంటైన్లో ఉన్న సురజిత్ ఆక్సిజన్ స్ధాయిలు 93కు పడిపోవడంతో జులై 19న ఆయనను ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. ఆపై తన పరిస్ధితి మెరుగవడంతో 24న డిశ్చార్జి చేశారని తానిప్పటికీ మందులు వాడుతున్నానని సురజిత్ చెప్పారు.
మరోవైపు టీకా తీసుకున్నా వైరస్ బారినపడి ఐసీయూలో చేరాల్సిన పరిస్ధితులు చాలా అరుదుగా తలెత్తుతాయని, టీకాలు మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడతాయని వైద్యులు పేర్కొన్నారు. టీకా తీసుకోవడం వల్లే తీవ్ర అస్వస్ధతకు లోనైనా ముగ్గురు కటుంబసభ్యులకు ప్రాణాపాయం కలగలేదని తెలిపారు.