New Study : తరచూ ఆగ్రహంతో ఇతరులపై కేకలు వేసే వారు తమ గుండెను ప్రమాదంలోకి నెడుతున్నారనే విషయం గుర్తుంచుకోవాలని తాజా అధ్యయనం హెచ్చరించింది. కోపం కొద్దిక్షణాల పాటు ఉన్నా అది రక్తనాళాల లైనింగ్లో ఒత్తిడి కలుగచేస్తుందని పరిశోధకులు గుర్తించారు. కరోనరీ గుండె జబ్బులున్న వారిలో ఈ తరహా ఒత్తిడి హృద్రోగాలు, స్ట్రోక్ ముప్పును పెంచుతుందని ఇప్పటికే గత అధ్యయనం వెల్లడించిన క్రమంలో తాజా పరిశోదన ప్రాధాన్యత సంతరించుకుంది.
తరచూ కోపంతో ఊగిపోయేవారిలో ఈ తరహా ప్రతికూల ప్రభావం ఉంటుందని ఈ పరిశోధన వెల్లడించడం గత అధ్యయనాన్ని సమర్ధించేలా ఉంది. గత అధ్యయనాల్లో ఉద్రేకం, గుండె ఆరోగ్యం మధ్య సంబంధం ఉందనే సంకేతాలు పంపినా అందుకు కారణాలు అస్పష్టంగా ఉన్నాయి. ఇక తాజా అధ్యయనంలో ప్రశాంతంగా ఉండటం రక్తనాళాల ఆరోగ్యానికి మేలు చేస్తుందని వెల్లడించింది. అయితే ఆందోళన, విచారం రక్తనాళాల్లో ఇదే తరహా ప్రభావాలను ప్రేరేపించవని అధ్యయనం గుర్తించడం ఆసక్తికరం.
అయితే ఈ ఉద్వేగాలకు గుండె సమస్యలతో సంబంధం ఉంటుందని గత అధ్యయనాలు వెల్లడించాయి. రక్తనాళాల బలహీనత గుండె పోటు, స్ట్రోక్ ముప్పును పెంచడంతో సంబంధం ఉందని అధ్యయన రచయిత, కొలంబియా యూనివర్సిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్ ప్రొఫెసర్ డైచీ షింబో వివరించారు. ప్రతికూల ఉద్వేగాలు హృద్రోగాలు, గుండెపోటుకు దారితీస్తాయని గతంలో కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. వీటిలో ముఖ్యమైన ప్రతికూల ఉద్వేగం కోపమేనని గుర్తించారు. గత అధ్యయనాల్లో ఆందోళన, విచారం కూడా హృద్రోగ ముప్పు పెంచుతాయని వెల్లడైంది. ఇక తాజా అధ్యయన వివరాలు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
Read More :