KCR | రాజన్న సిరిసిల్ల : బీజేపీ ఎజెండాలో పేదలు లేరు కానీ పెద్ద పెద్ద గద్దలు ఉన్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని కేసీఆర్ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా.. దేవుని పేరు కూడా ఉండాలని వేములవాడ రాజన్న పేరును సిరిసిల్ల జిల్లాకు పెట్టుకున్నాం. లోక్సభ ఎన్నికల్లో మూడు పార్టీలు రంగంలో ఉన్నాయి. ఏ పార్టీలు ఏం చేశాయో మీకు అందరికీ బాగా తెలుసు. నిన్న ఈ వేములవాడకు ప్రధాని మోదీ వచ్చారు. ఆయన పక్కనే బండి సంజయ్ ఉన్నాడు. దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడే ప్రధాని మోదీ, హిందూ హిందూ అని మాట్లాడే బండి సంజయ్ వేములవాడకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. వేములవాడ దేవస్థానాన్ని బాగు చేస్తామని చెప్పారా..? అది కూడా లేదు. ఇరుకుగా ప్లేస్ ఉందని చెప్పి నేను అక్కడొచ్చి 35 ఎకరాలు ఇప్పించి అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాను. బండి సంజయ్ రూపాయి అడగలేదు.. మోదీ ఇవ్వలేదు అని కేసీఆర్ మండిపడ్డారు.
ఇది చేనేతలు ఎక్కువగా నివసించే ప్రాంతం. గతంలో చేనేతల ఆత్మహత్యలు జరిగితే కన్నీళ్లు పెట్టుకున్నా.. బాధపడ్డాను. అనేక స్కీమ్స్ తెచ్చి బతుకమ్మ చీరలు, స్కూల్ డ్రస్సులు, క్రిస్మస్, రంజాన్ కానుకలు ఆర్డర్లుగా ఇచ్చి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాం. రూ. 372 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవ్వమని అడిగితే నిరోధ్లు, పాపడలు అమ్ముకోండని కాంగ్రెస్ నేతలు అంటే కోపం వచ్చి ఒక మాట అన్నాను. దాంతో నా మీద 48 గంటల నిషేధం పెట్టారు. చేనేత, పద్మశాలిలను అవమానించారని మాట్లాడితే నిషేధం పెట్టారు. దేశంలో తొలిసారి చేనేత మీద జీఎస్టీ వేసిన మొదటి ప్రధాని మోదీ. ఏ ప్రధాని కూడా చేనేతపై జీఎస్టీ విధించలేదు. కానీ మోదీ విధించారు. చేనేతలకు ఉన్న ఇన్సూరెన్స్తో పాటు అన్ని స్కీమ్స్ రద్దు చేశారు మోదీ. చేనేత కార్మికులంటే లెక్కనే లేదు. బీజేపీ ఎజెండాలో పేదలు, కార్మికులు, రైతులు, ఆటో రిక్షా కార్మికులు ఉండనే ఉండరు. పెద్ద పెద్ద గద్దల ఎజెండా ఉంటది. అదానీ అంబానీ లాంటి లక్షల కోట్ల శ్రీమంతులకు కార్పొరేట్ ట్యాక్స్లు రద్దు చేస్తరు తప్ప పేదవాళ్లకు మంచి చేయలేదు అని కేసీఆర్ మండిపడ్డారు.
2014లో నేను ప్రధానిగా గెలిచిన తర్వాత 15 లక్షలు ఇస్తానని చెప్పాడు. 15 లక్షలు కాదు.. పదిహేను రూపాయాలు కూడా రాలేదు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ రాలేదు. అచ్చేదిన్ రాలేదు. బేటీ పడావో బేటి బచావో వచ్చిందా..? జన్ ధన్ ఖాతా ఏమైనా జరిగిందా…? డబ్బాలో రాళ్లు వేసి ఊపినట్టే కానీ ఏం జరగలేదు. ఎవరికి కూడా న్యాయం జరగలేదు. గొల్లకుర్మలకు గొర్రెలు ఇస్తుంటే అడ్డు పడ్డరు. మోదీ గెలిస్తే పెట్రోల్, డిజీల్ ధర 400 దాటుతది. మోసపోతే గోసపడుతాం.. జాగ్రత్త అని మనవి చేస్తున్నా అని కేసీఆర్ పేర్కొన్నారు.