వరంగల్ : రాష్ట్రంలో మావోయిస్టుల ప్రముఖులతో పాటు క్యాడర్ లొంగిపోవడంతో మావోయిజం ( Maoism ) ప్రభావం ఇక లేదని డీజీపీ సీవీ ఆనంద్ ( DGP CV Anand ) అన్నారు. నేడు డ్రగ్స్ సమస్య ( Drug Menace ) ప్రధానంగా ఉందని వెల్లడించారు. ఆదివారం వరంగల్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
తన ట్రైనీ ఐపీఎస్ వరంగల్ నుంచే ప్రారంభమయ్యిందని గుర్తు చేశారు. ఆ రోజుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్తే, తిరిగి వస్తామా అన్నంతగా నక్సల్స్ ప్రభావం ఉండేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2010 నుంచి మావోయిజం తగ్గిందని అన్నారు. లొంగిపోయిన మావోలతో ములుగులో సోమవారం ఒక కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు.
లొంగిపోయిన, మావో బాధితుల కోసం ఒక ఆప్ తయారు చేశామని వెల్లడించారు. 1992-96 మధ్య చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా కొంత తక్కువ వచ్చిందని తమ దృష్టికి వచ్చిందని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. నార్కొటిక్ బ్యూరో, ట్రాఫిక్, సీఐడీకి చెందిన వారితో కలసి ఒక బృందంగా ఏర్పడి జిల్లాల పర్యటనలు చేస్తున్నామని డీజీపీ ఆనంద్ తెలిపారు.