బాలానగర్, సెప్టెంబర్ 15: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పెద్ద చెరువులో బుధవారం 90వేల చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధికి ఎంతో కృషిచేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వందశాతం రాయితీపై మత్స్యకారులకు చేపపిల్లలను సరఫరా చేస్తున్నదన్నారు. ఈ సంవత్సరం జడ్చర్ల నియోజకవర్గంలో (515) చెరువులను గుర్తించామని, వీటిలో కోటి చేపపిల్లలను విడుదల చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
మత్స్యరంగానికి అధిక ప్రాధాన్యత
రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరిపోసిన ఘనత సీఎం కేసీఆర్దేనని టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వాల్యానాయక్ అన్నారు. మండలంలోని నందారం చెరువులో బుధవారం 27వేల చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, ఎంపీపీ కమల, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ వెంకటాచారి, రైతు బంధుసమితి మండలాధ్యక్షుడు గోపాల్రెడ్డి, టీఆర్ఎస్ యూత్వింగ్ మండలాధ్యక్షుడు ప్రకాశ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు మంజునాయక్, యాదయ్య, నాయకులు అరుణ్కుమార్, నితీశ్, శ్రీకాంత్, సతీశ్రెడ్డి తదితరులు ఉన్నారు.