మహబూబ్నగర్, సెప్టెంబర్1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇవాళ టీఆర్ఎస్ పార్టీ జెండా పండగను పెద్ద ఎత్తున నిర్వహించనుంది. ఈ మేరకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలందరితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పలు సూచనలు చేశారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో పార్టీ జెండాను ఎగురవేసేందుకు పార్టీ నేతలు కార్యకర్తలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. పార్టీ జెండా పండుగ కార్యక్రమానికి పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ హాజరయ్యేందుకు సిద్ధం అయ్యారు. ఇవాళే డీల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనుండడం చరిత్రలో నిలిచిపోనుంది. ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు జిల్లాకు చెందిన మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు మన్నె శ్రీనివాస్రెడ్డి, పి.రాములు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలు తరలివెళ్లారు.
జెండా పండుగ తర్వాత కమిటీల ఏర్పాటు
ఇవాళ జెండా పండుగ పూర్తయిన తర్వాత కమిటీల ఏర్పాటుపై దృష్టిపెట్టనున్నారు. గురువారం నుంచి ఈనెల 12వరకు గ్రామ పంచాయతీలు, వార్డు కమిటీల ఏర్పాటు చేయనున్నారు. అనంతరం సెప్టెంబరు 20 వరకు మండల, పట్టణ కమిటీల నిర్మాణం పూర్తి చేయనున్నారు. జిల్లా కార్యవర్గాల ఎంపిక అనంతరం రాష్ట్ర కార్యవర్గాన్ని సీఎం కేసీఆర్ ప్రకటిస్తారు. ఆయా కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కచ్చితంగా 50 శాతం ఉండాలని కేటీఆర్ స్పష్టం చేశారు.
గ్రామస్థాయిలో సోషల్ మీడియా కమిటీలు
సామాజిక మాధ్యమాల ప్రాధాన్యాన్ని గుర్తించి తొలిసారిగా టిఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి నుంచే సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యింది. ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఈ కమిటీలు ఉపయోగపడనున్నాయి. ఇకపై సోషల్ మీడియా కమిటీలను యాక్టివ్ గా ఉంచుతూ వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సైతం పార్టీ యంత్రాం గం సిద్ధమవుతున్నది. ప్రధాన మీడియాతో పోలిస్తే సోషల్ మీడియా సైతం ప్రస్తుతం ప్రజా బాహుళ్యంలోకి దూసుకుపోయిన తరుణంలో సోషల్ మీడియా ప్రాధాన్యాన్ని గుర్తించిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా గ్రామస్థాయి నుంచే పటిష్టం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.