మహ్మదాబాద్, జూలై 13 : ఎండాకాలంలో కాసేపు సేద తీరుదామంటే రోడ్లవెంట చెట్టులేకుండేది.. వానకాలం వచ్చిందంటే రోడ్ల వెంట మురుగునీరు పారే పరిస్థితి కనిపించేంది.. తెలంగాణ రాకముందు చాలా గ్రామాల్లో కనీస వసతులు ఉండేవి కాదు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి కనీస మౌలిక వసతులకు కూడా నోచుకునే పరిస్థితి లేదు. కానీ స్వరాష్ట్రం సాధించాక గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. నూతన పంచాయతీ చట్టంతో అభివృద్ధికి కేరాఫ్గా మారింది. ఎటు చూసినా పచ్చదనంతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వైకుంఠధామం, సీసీ రోడ్లు, మూడు పల్లెప్రకృతి వనాలతో ఊరంతా కళకళలాడుతున్నది. 1100 జనాభా ఉన్న అన్నారెడ్డిపల్లి తండా పల్లె ప్రగతిలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఒకప్పుడు గ్రామానికి వెళ్లాలంటేనే వెనకడుగు వేసే జనం.. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూసి ఔరా అని ఆశ్చర్యపడుతున్నారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో గ్రామానికి బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మాణ పనులకు రూ.కోటికి పైగా నిధులు మంజూరయ్యాయి. త్వరలో బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మాణ పనులు పూర్తికానున్నాయి.
గ్రామంలో జరిగిన అభివృద్ధి..
తెలంగాణ ప్రభుత్వం అబివృద్ధి పనులు చేపడుతున్నది. నెలనెలా నిధులు విడుదల చేస్తున్నది. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, పల్లె ప్రకృతివనం, హరితహారం నర్సరీల ఏర్పాటు, మిషన్ భగీరథ నీళ్లు.. ఇలా గతంలో లేని అభివృద్ధి పనులు చేపట్టారు. ఇవే కాకుండా ప్రజలకు నేరుగా రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయి. గ్రామంలో రూ.8 లక్షలతో సీసీ రోడ్లు, కల్వర్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓపెన్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారు. వివిధ పనుల మరమ్మతు పనులు కూడా చేశారు. శ్మశాన వాటిక, పల్లె ప్రకృతివనం, నర్సరీ నిర్మాణాల కోసం దాదాపు రూ.15 లక్షలు వెచ్చించారు.
అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..
గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పె ట్టాం. ప్రభుత్వం ఇచ్చిన నిధులను సక్రమంగా సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. ఎమ్మెల్యే, గ్రామస్తుల సహకారంతో మరింత అందంగా తీర్చిదిద్దుతాం. నర్సరీలో మొక్కల నిర్వహణ బాగుంది. పల్లెప్రకృతి వనాన్ని చూసి పలువురు అభినందిస్తున్నారు.
అందంగా పల్లె ప్రకృతి వనం..
పల్లెప్రగతి సత్ఫలితాలిస్తున్నది. గ్రా మంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం అందంగా నిలించింది. పట్టణా ల మాదిరిగా తీర్చిదిద్దిన వనం అధికారులు, ప్రజలను ఆకట్టుకుంటున్నది. గ్రామంలో రోడ్లకు ఇరువైపులా చెట్ల తో పచ్చని వాతావరణం కనపడుతున్నది. – సూర్యానాయక్, గ్రామస్తుడు
పచ్చదనంతో నిండిపోయింది..
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా గ్రామంలో ఎప్పుడూ చూడని అభివృద్ధి జరిగింది. గతంతో ఎన్నో సమస్యలు ఉండేవి. సర్పంచ్ ప్రత్యేక చొరవతో ప్రతి సమస్యనూ పరిష్కరించుకుంటున్నాం. అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రభుత్వ పాఠశాల, కార్యాలయాలు పచ్చదనంతో నిండిపోయాయి.